జీవో 11 అమలుకు పంచాయతీ కార్యదర్శుల డిమాండ్
ABN , Publish Date - Mar 04 , 2024 | 03:17 AM
పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన జీవో 11ను వెంటనే అమలు చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జానీ బాషా డిమాండ్ చేశారు.
![జీవో 11 అమలుకు పంచాయతీ కార్యదర్శుల డిమాండ్](https://media.andhrajyothy.com/media/2024/20240301/kk_dee5d494e8.jpg)
విజయవాడ (అజిత్సింగ్నగర్), మార్చి 3: పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన జీవో 11ను వెంటనే అమలు చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జానీ బాషా డిమాండ్ చేశారు. విజయవాడలోని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాల నుంచి పంచాయతీ కార్యదర్శుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానీబాషా మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో అవినీతి ప్రక్షాళన కోసం పూర్తిస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఉద్యోగులకు మేలు చేకూర్చే ఏ రకమైన సహకారమైనా అందిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన జీవో నం 11 ద్వారా గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన అధికారాలు త్వరితగతిన అమలు చేయించే బాధ్యత తీసుకున్నామని పేర్కొన్నారు.