Share News

అయోధ్య రాముడిని చూపిస్తూ ఓపెన్‌ బ్రెయిన్‌ సర్జరీ..!

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:33 AM

పెద్ద స్థాయి శస్త్రచికిత్సల్లో సైతం రోగులకు పూర్తి మత్తు ఇవ్వకుండా, వారు మెలకువగా ఉండగానే ఓపెన్‌ బ్రెయిన్‌ సర్జరీలు చేయడం ఇటీవల పరిపాటిగా మారింది. ఈ క్రమంలో గుంటూరులో మరోసారి రోగి స్పృహలో ఉండగానే మెదడుకు శస్త్రచికిత్స

అయోధ్య రాముడిని చూపిస్తూ ఓపెన్‌ బ్రెయిన్‌ సర్జరీ..!

రోగి మెలకువగా ఉండగానే ట్యూమర్‌ తొలగింపు

గుంటూరులో మరో ఆపరేషన్‌ విజయవంతం

గుంటూరు (మెడికల్‌), ఫిబ్రవరి 19: పెద్ద స్థాయి శస్త్రచికిత్సల్లో సైతం రోగులకు పూర్తి మత్తు ఇవ్వకుండా, వారు మెలకువగా ఉండగానే ఓపెన్‌ బ్రెయిన్‌ సర్జరీలు చేయడం ఇటీవల పరిపాటిగా మారింది. ఈ క్రమంలో గుంటూరులో మరోసారి రోగి స్పృహలో ఉండగానే మెదడుకు శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. రోగి శ్రీరాముడి భక్తుడు కావడంతో... ఆపరేషన్‌ థియేటర్‌లో ల్యాప్‌ట్యా్‌పలో అయోధ్య శ్రీరాముడి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రదర్శించారు. మరోవైపు కపాలం తెరిచి వైద్యులు ఆపరేషన్‌ చేస్తుండగా.. రోగి భక్తితో చేతులు జోడించి జై శ్రీరామ్‌ అంటూనే సర్జరీకి సహకరించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రుకు చెందిన దానబోయిన మణికంఠ (29) మెదడు ఎడమ భాగంలో ఏర్పడిన కణితి (గ్లయోమా) కారణంగా డిసెంబరు నుంచి మూర్ఛలతో బాధపడుతున్నాడు. వైద్యం కోసం శ్రీసాయి హాస్పిటల్‌ను సంప్రదించారు. బ్రెయిన్‌ ట్యూమర్‌ తొలగించే సమయంలో కాళ్లు, చేతులు చచ్చుబడే ప్రమాదం ఉన్నట్లు గుర్తించి దీన్ని నిరోధించేందుకు రోగిని మెలకువగా ఉంచి ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఫిబ్రవరి 11న ఆపరేషన్‌ను ప్రారంభించి విజయవంతంగా ముగించారు. రోగి కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జి చేశారు. ఈ ఆపరేషన్‌లో న్యూరో సర్జన్లు డాక్టర్‌ భవనం హనుమా శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ ఆకాశ్‌, ఎనస్థటిస్ట్‌ డాక్టర్‌ త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 05:33 AM