ఏలూరులో పేలిన ఉల్లి బాంబులు
ABN , Publish Date - Nov 02 , 2024 | 04:14 AM
ఉల్లిపాయ బాంబులను గోనెసంచిలో పెట్టుకుని స్కూటర్పై ఇద్దరు యువకులు తీసుకుని వెళ్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.
ఒకరి మృతి, 8 మందికి తీవ్రగాయాలు
ఏలూరుక్రైమ్, నవంబరు1 (ఆంధ్రజ్యోతి): ఉల్లిపాయ బాంబులను గోనెసంచిలో పెట్టుకుని స్కూటర్పై ఇద్దరు యువకులు తీసుకుని వెళ్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా స్కూటర్పై ఉన్న యువకుడితో పాటు సమీపంలో ఉన్న మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఏలూరు జిల్లా ఏలూరులోని సత్యనారాయణపేటకు చెందిన తాబేలు సాయిరామ్ అతడి స్నేహితుడు దుర్గాసి సుధాకర్(28) గురువారం ఏలూరు తూర్పువీధి కబేళ సమీపంలోని అనధికార బాణాసంచా తయారీ కేంద్రం నుంచి ఉల్లిపాయ బాంబులను బస్తాలో కట్టి స్కూటీపై ఇద్దరి మధ్యలో పెట్టుకున్నారు. అక్కడ నుంచి సత్యనారాయణపేట వెళ్తుండగా తూర్పువీధి గౌరమ్మ గుడి వద్ద స్కూటర్ గోతిలో పడటంతో బస్తాలోని ఉల్లిపాయ బాంబులపై ఒత్తిడిపడి ఆకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో స్కూటర్ నడుతున్న సుధాకర్ శరీరం రెండు ముక్కలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. స్కూటర్ వెనుక కుర్చున్న సాయిరామ్తో పాటు ఆ సమీపంలో ఉన్న మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఏలూరు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ కేపీఎస్ కిషోర్, క్లూస్టీమ్ విజయవాడ పోరెన్సిక్ బృందాలు పరిశీలించాయి.