పోలింగ్ కేంద్రాల్లో వందశాతం సౌకర్యాలు కల్పించాలి
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:17 PM
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో వందశాతం కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ పీఎస్ గిరీషా సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఎన్నికలపై సెక్టోరల్ అధికారులకు శిక్షణ ఇవ్వాలి
కలెక్టర్ పీఎస్ గిరీషా
రాయచోటి(కలెక్టరేట్), జనవరి 12: జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో వందశాతం కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ పీఎస్ గిరీషా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణపై నియోజకవర్గ ఈఆర్వోలు, ఆర్డబ్ల్యుఎస్, స్కూల్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్అండ్బీ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1607 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలైన తాగునీరు, ర్యాంపులు, నీటి వసతి, మరుగుదొడ్డి, ఫర్నీచర్, విద్యుత్ సౌకర్యం, లైటింగ్ పరికరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇందులో ఈఆర్వోలు ఇచ్చిన నివేదిక మేరకు ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు 259, తాగునీరు 87, నీటి వసతితో మరుగుదొడ్లు 118, ఫర్నీచర్ ఏర్పాటు 204, విద్యుత్ సౌకర్యం 64, లైటింగ్ పరికరాలు 83 పీఎస్లలో ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈఆర్వోలు, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేసి ఈ నెల 25లోగా వందశాతం పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలను మరొకసారి క్షుణ్ణంగా తనిఖీ చేసి ఇంకనూ కనీస సౌకర్యాలను కల్పించాల్సిన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. ఈ నెల 25 తర్వాత ఎన్నికల నిర్వహణపై సెక్టారుల అధికారులకు శిక్షణ ఏర్పాటు చేయాలని ఈఆర్వోలకు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, డీఆర్వో సత్యనారాయణ, ఆర్డీవోలు రంగస్వామి, మురళి, రామక్రిష్ణారెడ్డి, పీలేరు, తంబళ్లపల్లె, రైల్వేకోడూరు ఈఆర్వోలు గోపాలకృష్ణ, రాఘవేంద్ర, మల్లికార్జునరెడ్డి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ ప్రసన్నకుమార్, డీఈవో శ్రీరామ్పురుషోత్తం, పీఆర్ ఎస్ఈ దయాకర్రెడ్డి, ఎస్ఎస్ఏ జిల్లా కోఆర్డినేటర్ కరుణాకర్, ఇంటర్మీడియట్ ఆర్ఐవో కృష్ణయ్య, విద్యుత్, ఆర్అండ్బీ డీఈలు చంద్రశేఖర్రెడ్డి, సహదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.