25న జూన్ నెల రూ.300 దర్శన టికెట్ల కోటా
ABN , Publish Date - Mar 14 , 2024 | 04:44 AM
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జూన్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈ నెల 25వ తేదీన విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్సైట్లో ఈ కోటాను విడుదల చేయనున్నారు. ఇదే నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల లక్కీడిప్
![25న జూన్ నెల రూ.300 దర్శన టికెట్ల కోటా](https://media.andhrajyothy.com/media/2024/20240313/55_47a5d3f266.jpg)
18, 21 తేదీల్లో ఆర్జితసేవల కోటా విడుదల
తిరుమల, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జూన్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈ నెల 25వ తేదీన విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్సైట్లో ఈ కోటాను విడుదల చేయనున్నారు. ఇదే నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల లక్కీడిప్ కోసం భక్తులు ఈ నెల 18వ తేదీ ఉదయం 10 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు సేవలకు ఎంపికైన భక్తులు నగదు చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు. జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న జ్యేష్టాభిషేక ఉత్సవాల్లో పాల్గొనేందుకు మార్చి 21న ఉదయం 10 గంటలకు టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు. 23 ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడదల చేస్తారు. మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిల్లోని గదుల కోటాను విడుదల చేస్తారు. 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిల్లోని శ్రీవారి సేవా కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటా, ఒంటి గంటకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు.