అలిపిరి పాదాల మండపం పరిశీలన
ABN , Publish Date - Jan 18 , 2024 | 04:07 AM
తిరుపతిలోని అలిపిరిలో వున్న పాదాలమండపాన్ని, తిరుమలలోని పుష్కరిణి వద్దనున్న అహ్నిక మండపాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా విభాగ అధికారులు బుధవారం పరిశీలించారు. తిరుమలలో శిథిలావస్థలో ఉన్న పార్వేట మండపాన్ని టీటీడీ గతేడాది తొలగించి ఆ స్థానంలో నూతన మండపాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.
తిరుమల, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని అలిపిరిలో వున్న పాదాలమండపాన్ని, తిరుమలలోని పుష్కరిణి వద్దనున్న అహ్నిక మండపాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా విభాగ అధికారులు బుధవారం పరిశీలించారు. తిరుమలలో శిథిలావస్థలో ఉన్న పార్వేట మండపాన్ని టీటీడీ గతేడాది తొలగించి ఆ స్థానంలో నూతన మండపాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణంపై పలు రాజకీయపార్టీల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వచ్చాయి. అలిపిరిలో భక్తుల విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన పాదాలమండపాన్ని రూ.1.36 కోట్లతో పునర్నిర్మించాలని తీసుకున్న నిర్ణయంపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పాదాలమండపంతో పాటు అహ్నిక మండపాన్ని పరిశీలించి తగిన సూచనలు అందించాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి గతేడాది నవంబరు 30వ తేదీన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మండపాల నిర్మాణంపై సాంకేతిక సహాయాన్ని అందించేందుకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్కు చెందిన అధికారులతో ఏర్పాటైన కమిటీ బుధవారం తిరుపతికి చేరుకుని పరిశీలించింది. గురువారం మరోసారి మండపాలను పరిశీలించి నివేదికను రూపొందించనున్నారు.