త్వరలో నోటిఫికేషన్
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:52 PM
త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుందని, అధికారులు ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు.

అధికారులు ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి
శిక్షణలో కలెక్టర్ విజయరామరాజు
కడప(కలెక్టరేట్), మార్చి 6: త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుందని, అధికారులు ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సభాభవన్లో సాధారణ ఎన్నికలకు సంబంధించి ఈఆర్వోలు, సబ్ డివిజనల్ పోలీసు అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, అసెంబ్లీ నియోజకవర్గాల మాస్టర్ ట్రైనర్లకు రెండవ దశ శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతి త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుందన్నారు. జిల్లాలో ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి అధికారి సంసిద్ధం కావాలన్నారు. ముఖ్యంగా ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది పాత్ర అత్యంత కీలకమైనదన్నారు.
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల
జిల్లాలో గత ఏడాది డిసెంబరు నెలలో వచ్చిన తుఫాన్ ప్రభావంతో 4,275 హెక్టార్లలో పంటలు నష్టపోయిన 7,521 మంది రైతులకు మంజూరైన ఇన్పుట్ సబ్సిడీ రూ.7.01 కోట్లను బుధవారం రైతుల ఖాతాల్లో జమచేశారు. అలాగే 169 హెక్టార్లలో ఉద్యాన పంటలు నష్టపోయిన 254 మంది రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ మొత్తం రూ.40.17 లక్షలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో లబ్ధిదారులకు మెగా చెక్కును కలెక్టర్ వి.విజయరామరాజు అందజేశారు. జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు, జిల్లా ఉద్యాన శాఖాధికారి రాజీవ్ మైఖేల్ తదితరులు హాజరయ్యారు.