‘వాట్సాప్’ వాడలేదని వేటు!
ABN , Publish Date - May 26 , 2024 | 02:02 AM
వృత్తిపరమైన విధులకు సంబంధించి వాట్సా్పను ఉపయోగించడం లేదని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఓ ఉపాధ్యాయడిని సస్పెండ్ చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
![‘వాట్సాప్’ వాడలేదని వేటు!](https://media.andhrajyothy.com/media/2024/20240511/kk_cddbab9306.jpg)
టీచర్ను సస్పెండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా డీఈవో ఆదేశాలు
కంటి సమస్య ఉందని చెప్పినా కనికరించని వైనం
విజయవాడ, మే 25(ఆంధ్రజ్యోతి): వృత్తిపరమైన విధులకు సంబంధించి వాట్సా్పను ఉపయోగించడం లేదని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఓ ఉపాధ్యాయడిని సస్పెండ్ చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ మొగల్రాజపురంలో బీఎ్సఆర్కే నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఎల్.రమేష్ సెకండరీ గ్రేడ్ టీచర్గా ఉన్నారు. ఆయనకు చూపు ఇబ్బందికరంగా ఉండడంతో స్మార్ట్ ఫోన్ వాడకాన్ని, టీవీ చూడడాన్ని తగ్గించుకోవాలని వైద్యులు సూచించారు. రెండు నెలల క్రితం పదో తరగతి పరీక్షాపత్రాల మూల్యంకనంలో రమే్షను చెక్కర్(దిద్దిన జవాబు పత్రాలకు మార్కులు మొత్తం కూడాలి) విధుల్లో నియమిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను మరో ఉపాధ్యాయుడు ఆయనకు వాట్సా్పలో పంపారు. అదే సమయంలో రమేష్ తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా, చెక్కర్ విధులను తప్పించాల ని రమేష్ హెచ్ఎం నాగరాజును కోరారు. తన చేతుల్లో ఏమీ లేదని చెప్పడంతో డీఈవోను కలిశారు. అయితే పాఠశాలలో డ్యూటీలు చేసినప్పుడు, అధికారికంగా కేటాయించిన డ్యూటీలు ఎందుకు చేయరని డీఈవో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత యూటీఎఫ్ నేతలు చొరవ తీసుకుని చెక్కర్ డ్యూటీని రద్దు చేయించారు. తన కంటి చూపు సమస్య, తండ్రి అనారోగ్యంగా ఉండడంతో తాను ఫోన్ ఉపయోగించలేకపోతున్నానని, తనకు కేటాయించే పనుల సమాచారం అందజేయడానికి ప్రత్యామ్నాయం చూపాలని వాట్సాప్ గ్రూపులో ఒక మెసేజ్ పోస్టు చేశారు. తర్వాత కొన్ని రోజులకు వాట్సాప్ గ్రూపు నుంచి బయటకు వచ్చేశారు. ఇదే విషయాన్ని డీఈవో వద్దకు వెళ్లి తాను వాట్సాప్ చూడలేనని, స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం లేదని లేఖ ఇచ్చారు. డీఈవో ఆదేశాల మేరకు వైద్యులు ఇచ్చిన రిపోర్టులను కూడా సమర్పించారు. అంతవకు బాగానే ఉన్నా.. తర్వాత కొన్ని రోజులకు రమే్షను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై డీఈవోను వివరణ కోరగా గ్రూపులో పోస్టు చేసే ఆదేశాలు గానీ, అప్డేట్స్ గానీ చూడనని చెబుతున్నాడన్నారు.