Sharmila: షర్మిలపై మరింత పెరగనున్న వైసీపీ సోషల్ మీడియా దాడి.. తాడేపల్లి వేదికగా శిక్షణ
ABN , Publish Date - Feb 13 , 2024 | 02:51 AM
‘టార్గెట్ షర్మిల’.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన మంత్రులు, వైసీపీ సోషల్ మీడియా మూక పెద్ద ఎత్తున అమలు చేస్తున్న తాజా కార్యక్రమమిది.
![Sharmila: షర్మిలపై మరింత పెరగనున్న వైసీపీ సోషల్ మీడియా దాడి.. తాడేపల్లి వేదికగా శిక్షణ](https://media.andhrajyothy.com/media/2023/20231205/Whats_App_Image_2024_02_13_at_07_03_14_899d060a60.jpeg)
షర్మిలపై ఆ స్థాయి వికృత దాడికి రెడీ!
ఇంటి ఆడపడుచు అని కూడా చూడకుండా చెల్లి షర్మిలపై పార్టీ సోషల్ మీడియాను ఉసిగొల్పుతున్న జగన్ అండ్ కో మరో అడుగు ముందుకేయబోతోందా? ఇప్పటికే చెవులతో వినలేని, నోటితో అనలేని రీతిలో పేట్రేగుతున్న అనైతిక మూక మరింత అడ్డగోలుగా దాడికి దిగబోతోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్న షర్మిలకు జవాబు ఎలా చెప్పాలో తెలీక.. అనైతిక దాడిని తీవ్రతరం చేయడంపై తాడేపల్లి ప్యాలెస్ వేదికగా వ్యూహం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
భారతి డైరెక్షన్.. సజ్జల, భార్గవ స్ర్కీన్ప్లే?
తాడేపల్లి వేదికగా మూకలకు శిక్షణ
దాడి ఎక్కడ, ఎలా ఉండాలో తర్ఫీదు
తెలంగాణలో కాంగ్రె్సపై షర్మిల చేసిన
విమర్శలే అస్త్రాలుగా దాడికి సన్నద్ధం
మరి నాడు జగన్పై బొత్స, రోజా,
రజని విమర్శలు చేయలేదా?
జగన్ వచ్చింది కాంగ్రెస్ నుంచి కాదా?
చెల్లెలి ప్రశ్నలకు జవాబివ్వలేక మూకను
ఉసిగొల్పడంపై సర్వత్రా విమర్శలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘టార్గెట్ షర్మిల’.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన మంత్రులు, వైసీపీ సోషల్ మీడియా మూక పెద్ద ఎత్తున అమలు చేస్తున్న తాజా కార్యక్రమమిది. కాసేపు ఆమె జగన్కు చెల్లెలన్న విషయం పక్కన పెట్టినా.. కనీసం మహిళ అన్న గౌరవం కూడా లేకుండా చెలరేగిపోతున్నారు. నిత్యం ఆమెను ఎలా విమర్శించాలో ఏకంగా తాడేపల్లి ప్యాలె్సలోనే శిక్షణ ఇస్తున్నారంటే.. ఎంతగా కక్ష పెంచుకున్నారో అర్థమవుతోంది. ఇప్పుడిక ఆమెను ‘చంద్రముఖి’గా అభివర్ణిస్తూ మరింత ఘోరమైన రీతిలో విరుచుకుపడేందుకు ఆ మూక సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, విభజన హామీలు, సీపీఎస్ రద్దు, మద్య నిషేధం, భూముల కబ్జాలు, కరెంటు చార్జీల బాదుడు తదితరాలపై పీసీసీ అధ్యక్షురాలి హోదాలో షర్మిల చేస్తున్న విమర్శలు సూటిగా.. ఘాటుగా తగులుతుండడంతో జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ అంశాలపై టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ చాలా రోజులుగా ప్రస్తావిస్తున్నా ఆయన ఎన్నడూ లెక్కచేయలేదు. కానీ షర్మిల పదునైన మాటలు జనంలోకి బాగా చొచ్చుకుపోతున్నాయన్న దుగ్ధతో.. ఆమెను కించపరిచే విషయంలో అథమ స్థాయికి దిగజారుతున్నారు. తీవ్రస్థాయిలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.
అంచలంచెలుగా..
ముప్పేట దాడి చేయడం ద్వారా షర్మిలను కట్టడి చేయాలని జగన్ అండ్ కో తొలి రోజు నుంచీ విశ్వ ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు ప్రయోగించిన అస్త్రం అంటూ మొదలైన దాడి.. ఆ తర్వాత అథమ స్థాయికి చేరడం చకచకా జరిగిపోయింది. తొలుత ఆమె కులం, వ్యక్తిత్వాలపై దాడులు చేయించారు. పుంఖానుపుంఖాలుగా అసభ్య పోస్టులు పెట్టించారు. ఆమె బ్రాహ్మణుడైన అనిల్కుమార్ను పెళ్లి చేసుకున్నందున.. ఆమె ఎంత మాత్రం వైఎస్ షర్మిలారెడ్డి కాదు.. మొరుసుపల్లి షర్మిలా శాస్త్రి అంటూ హోరెత్తించారు.
ఒక దశలో ఆమె వైఎ్సకే పుట్టిందా అన్న దారుణమైన కామెంట్లతో తల్లి విజయలక్ష్మి కుంగిపోయే రీతిలో పోస్టులు పెట్టారు. అటు సోషల్ మీడియా, ఇటు వైసీపీ నేతలు ఎంతలా విరుచుకుపడుతున్నా షర్మిల ఏ మాత్రం లెక్కచేయకుండా వారి తీరును ఎండగడుతూ వచ్చారు. రాష్ట్రాధినేతగా ఐదేళ్లలో రాష్ట్రానికేం చేశావంటూ జగన్పై తన ప్రశ్నల దాడిని మరింత పెంచారు. మరోవైపు నీచమైన రీతిలో సాగుతున్న పోస్టులపై విమర్శలు చెలరేగడంతో జగన్ అండ్ కో రూటు మార్చింది. ఇప్పుడు ఆమెను ‘చంద్రముఖి’లా అభివర్ణించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆమెపై ఏ విధంగా దాడి చేయాలనే దానిపై ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ వేదికగానే శిక్షణ ఇస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏ రోజు ఎవరు ఏం మాట్లాడాలో, ఎలాంటి పోస్టులు పెట్టాలో అంశాలవారీగా అక్కడ తర్ఫీదు ఇస్తున్నట్టు సమాచారం. తాజా వ్యూహం ప్రకారం.. తెలంగాణలో వైఎ్సఆర్టీపీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు షర్మిల కాంగ్రె్సపై చేసిన విమర్శలను తెరపైకి తెచ్చి, ‘గంగ.. చంద్రముఖిగా మారిందంటూ’ వికృత ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొన్నటిదాకా తెలంగాణలో కాంగ్రె్సపై ఆమె చేసిన విమర్శల క్లిప్పింగ్లు, వీడియోలను తెరపైకి తెస్తూ ‘చంద్రముఖి’ పేరిట విరుచుకుపడాలన్నది వారి వ్యూహం. తెలంగాణలో అన్ని మాటలు అని, ఆంధ్రకు వచ్చి ఇప్పుడు అదే పార్టీ పగ్గాలు చేపట్టి, ఇలా మాట్లాడుతున్నారంటూ ఎదురుదాడి చేయాలన్నది వారి ఆలోచన. ‘చంద్రముఖి’ పేరిట మొదలెట్టనున్న దాడి.. జగన్ సతీమణి భారతీరెడ్డి డైరెక్షన్లోనే సాగనున్నట్లు షర్మిల భావిస్తున్నారని సమాచారం. భారతి డైరెక్షన్లో పురుడు పోసుకున్న ఈ వికృత ఆలోచనకు, సకల శాఖా మంత్రి సజ్జల, ఆయన కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్ భార్గవ స్ర్కీన్ప్లే ఇచ్చి జనంలోకి వదలనున్నారని తన సన్నిహితుల వద్ద ఆమె ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది.
మరి నాడు వారంతా అన్నదో...?
సహజంగా ఏ రాజకీయ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ వైఖరికి అనుగుణంగా నేతలు మాట్లాడడం సహజం. ఇప్పుడు జగన్ వద్ద ఉన్న కొందరు మంత్రులు గతంలో వైఎ్సను, జగన్ను, విజయలక్ష్మిని విమర్శించినవారేనని రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో.. నాటి మంత్రి-పీసీసీ అధ్యక్షుడు, ఇప్పుడు జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాజశేఖర్రెడ్డి మరణించగానే జగన్ సీఎం పదవి కావాలని పట్టుబట్టారని.. తన బిడ్డకు ఆ పదవి కట్టబెట్టాలని సోనియాగాంధీని విజయలక్ష్మి కూడా వేడుకున్నారని.. వారసత్వంగా ఇవ్వడానికి ఇదేమైనా రాచరికమా అని నిలదీశారు. అలాగే రోజా టీడీపీలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విడదల రజని కూడా టీడీపీలో ఉండగా.. జగన్ను రాక్షసుడితో పోలుస్తూ మాట్లాడారు. ఈ ముగ్గురికీ జగన్ తన కేబినెట్లో చోటు కల్పించడం గమనార్హం. తనపై తీవ్ర విమర్శలు చేసినవారిని పిలిచి పార్టీలో, ప్రభుత్వంలో చేర్చుకున్న జగన్.. సొంత చెల్లెలు తన కోసం చేసిన త్యాగాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించి దాడులకు ఉసిగొల్పుతుండటంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో ఆయన 16 నెలలు జైలులో ఉన్నప్పుడు.. వైసీపీని నిలబెట్టేందుకు షర్మిల ఊతకర్రగా మారారని.. పాదయాత్ర చేశారని.. విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారని గుర్తుచేస్తున్నారు. చెల్లెలిని కించపరిచేలా సొంత నేతలు మాట్లాడుతుంటే.. సీఎం హోదాలో ఉన్న జగన్ నిలువరించకపోగా.. మరింత ఉసిగొల్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. జగన్ కూడా గతంలో కాంగ్రె్సలో ఉన్నవారే. కడప ఎంపీగానూ గెలిచారు. ఆ పార్టీకి మద్దతుగానూ మాట్లాడారు.
చెల్లికి భద్రత ఇవ్వకుండా..
రాష్ట్రంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే.. గన్ కంటే ముందు జగన్ వస్తాడంటూ మంత్రి ఆర్కే రోజా అసెంబ్లీలో ముఖ్యమంత్రిని ప్రశంసల్లో ముంచెత్తారు. కానీ షర్మిల తన ప్రాణాలకే హాని ఉందని మొరపెట్టుకున్నా.. జగన్ స్పందించలేదు. సర్వత్రా విమర్శలు రావడం, ఆమె కోర్టుకు వెళ్తారన్న అనుమానంతో నామ్ కే వాస్తేగా 2+2 భద్రతను తాజాగా కల్పించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ షర్మిలపై ఈగవాలినా తానే కారణమని ప్రజలు భావిస్తారన్న భయంతోనే తూతూ మంత్రంగా రక్షణ కల్పించారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
సీఎం రేవంత్ను కలిసిన షర్మిల
హైదరాబాద్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. సోమవారం రేవంత్ నివాసంలో వారిద్దరు భేటీ అయ్యారు. ఈ భేటీ మర్యాద పూర్వకమే అయినా.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇదిలావుండగా... సినీ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్రెడ్డి అసెంబ్లీలోని సీఎం చాంబర్లో ముఖ్యమంత్రిని కలిశారు. బీఆర్ఎస్ నుంచి నాగార్జున సాగర్ టిక్కెట్టును ఆశించిన ఆయన.. రేవంత్రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది.