పిఠాపురంలో ట్రాన్స్జెండర్ నామినేషన్
ABN , Publish Date - Apr 25 , 2024 | 04:03 AM
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ట్రాన్స్జెండర్, బిగ్బాస్ ఫేం తమన్నా సింహాద్రి ఎన్నికల బరిలోకి దిగారు.
పిఠాపురం, ఏప్రిల్ 24: పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ట్రాన్స్జెండర్, బిగ్బాస్ ఫేం తమన్నా సింహాద్రి ఎన్నికల బరిలోకి దిగారు. భారత చైతన్య యువజన పార్టీ(బీసీవై) తరఫున ఆమె బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం నుంచి ర్యాలీగా గొల్లప్రోలు, పిఠాపురం పట్టణాల మీదుగా ఆర్వో కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ట్రాన్స్ ఉమెన్గా 2018లో తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టానని చెప్పారు. పవన్కల్యాణ్ను శ్రీరెడ్డి రోడ్డు మీదకు లాగుతున్న సమయంలో ఆయనకు, జనసేనకు అండగా నిలిచానని తెలిపారు. ‘పవన్, జనసేనకు నా అవసరం లేదనుకుంటా, వారు నన్ను పట్టించుకోలేదు. బీసీవై అధినేత రాంచంద్రయాదవ్ నా సేవా కార్యక్రమాలను గుర్తించి నాకు పిఠాపురం టికెట్ ఇచ్చారు’ అని తెలిపారు.