Share News

దివ్యాంగుడికి సీటు కేటాయింపులో నిర్లక్ష్యం

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:53 AM

ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు కేటాయించిన సీటును వారికి ఇవ్వడంలో నిర్లక్ష్యం చేసిన ఆర్టీసీ ఉద్యోగులపై శాశ్వత లోక్‌ అదాలత్‌ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.

దివ్యాంగుడికి సీటు కేటాయింపులో నిర్లక్ష్యం

ఏపీఎ్‌సఆర్టీసీపై శాశ్వత లోక్‌ అదాలత్‌ ఆగ్రహం

కర్నూలు(లీగల్‌), ఏప్రిల్‌ 24: ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు కేటాయించిన సీటును వారికి ఇవ్వడంలో నిర్లక్ష్యం చేసిన ఆర్టీసీ ఉద్యోగులపై శాశ్వత లోక్‌ అదాలత్‌ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. నంద్యాలకు చెందిన ఫిర్యాది చిన్న నాగన్న కర్నూలు బస్టాండ్‌ నుంచి గతనెల 28న నంద్యాల వెళ్లడానికి ఆత్మకూరు బస్సు డిపోకు చెందిన బస్సు ఎక్కాడు. దివ్యాంగుడు కావడంతో బస్సులో తమకు ప్రత్యేకంగా కేటాయించిన సీటు కోసం వెతకగా.. ఆ సీటులో వేరే ప్రయాణికులు కూర్చున్నారు. దివ్యాంగుడనైన తనకు కేటాయించిన సీటులో కూర్చున్న వారిని ఖాళీ చేయించాలని కండక్టర్‌ను కోరగా అతను నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. డిపో మేనేజర్‌ కూడా సరిగ్గా స్పందించకపోవడంతో శాశ్వత లోక్‌ అదాలత్‌ను ఆశ్రయించాడు. దీంతో శాశ్వత లోక్‌ అదాలత్‌ అధ్యక్షుడు ఎం.వెంకట హరినాథ్‌ ఏపీఎ్‌సఆర్టీసీపై ఆగ్రహం వ్యక్తం చేసి అధికారులకు నోటీసులు పంపారు. ఆర్టీసీ కండక్టరుతో సహా అధికారులు బుధవారం శాశ్వత లోక్‌ అదాలత్‌కు హాజరై ఫిర్యాదికి జరిగిన సేవా లోపానికి బేషరతుగా క్షమాపణలు కోరారు. దీంతో చిన్న నాగన్న రాజీ అయి.. తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి అంగీకరించారు.

Updated Date - Apr 25 , 2024 | 07:50 AM