నవరత్నాలు ఒట్టి హంబక్!
ABN , Publish Date - May 02 , 2024 | 05:10 AM
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు అమలు చేస్తున్న నవరత్నాలతో రాష్ట్రమంతా సుభిక్షమై పోయినట్లుగా చెబుతున్నారని,
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాకే
ఎస్సీ,ఎస్టీలను ఓట్లడగండి
జగన్కు ‘నవ సందేహాల’తో షర్మిల బహిరంగ లేఖ
అమరావతి, కడప, మే 1(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు అమలు చేస్తున్న నవరత్నాలతో రాష్ట్రమంతా సుభిక్షమై పోయినట్లుగా చెబుతున్నారని, ఇదం తా ఒట్టి హంబక్ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర(పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కొట్టిపారేశారు. ఈ నవరత్నాలపై నవ సందేహాల పేరిట తాము లేవనెత్తే ప్రశ్నలకు ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె జగన్కు బుధవారం బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అంశాలపై తొమ్మిది ప్రశ్నలు సంధించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను వైసీపీ ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడం నిజం కాదా? అని షర్మిల ప్రశ్నించారు. భూమిలేని నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సాగుకోసం భూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఉన్నట్టుండి వైసీపీ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో చెప్పాలని నిలదీశారు. వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యేల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలవారికి ప్రస్తుత ఎన్నికల్లో ఎక్కువమందికి ఎందుకు టికెట్లివ్వలేదని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, ఇతర దాడులు, హింస వంటి క్రైమ్ రేటు 2021లో అసాధారణంగా పెరిగిపోయినట్లు కేంద్ర ప్రభుత్వానికి గణాంకాలతో సహా నివేదిక సమర్పించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు జగన్ సరైన సమాధానాలు ఇచ్చాకే సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఓట్లడగాలని షర్మిల డిమాండ్ చేశారు. న్యాయ నవ సందేహాలు తీర్చే వరకు, సమాధానాలు చెప్పే వరకు, ప్రజల్ని ఓటు అడిగే నైతిక హక్కు కూడా సీఎం జగన్కు లేదన్నారు. ‘మీకు రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. వారి తరఫున మేం లేవనెత్తుతున్న ఈ సందేహాలకు సమాధానాలు చెప్పండి. అడిగేది మేమే అయినా.. మాకు జవాబులిస్తున్నామనుకోకండి.. ప్రజలకు సమాధానమివ్వండి. ఈ సందేహాలను నివృత్తి చేశాకే ప్రజలను ఓటు అడగాలి’ అని లేఖలో పేర్కొన్నారు.