Share News

నా వ్యాఖ్యలను వక్రీకరించారు

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:34 AM

నా వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరించి, ఫిర్యాదు చేశారు. వాస్తవాలను పరిశీలించండి. ఉద్దేశపూర్వకంగా నాపై బురద చల్లాలని చేసిన ఫిర్యాదుపై తదుపరి చర్యలు నిలుపుదల చేయండి’

నా వ్యాఖ్యలను వక్రీకరించారు

నాపై బురద చల్లడానికే ఫిర్యాదు

తదుపరి చర్యలు నిలిపేయండి

సీఈవోకు కోమటి జయరామ్‌ విజ్ఞప్తి

అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ‘నా వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరించి, ఫిర్యాదు చేశారు. వాస్తవాలను పరిశీలించండి. ఉద్దేశపూర్వకంగా నాపై బురద చల్లాలని చేసిన ఫిర్యాదుపై తదుపరి చర్యలు నిలుపుదల చేయండి’ అని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సమన్వయకర్త కోమటి జయరామ్‌ కోరారు. వైసీపీ నేత ఏఎన్‌ఎన్‌మూర్తి ఈసీకి చేసిన ఫిర్యాదుపై ఇచ్చిన నోటీసుపై గురువారం ఆయన వివరణ ఇచ్చారు. ‘మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సానుభూతిపరుల సమావేశం రహస్యంగా నిర్వహించిందని కాదు. సమావేశాన్ని యూట్యూబ్‌లో ప్రేక్షకుల కోసం ప్రసారం చేశాం. ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు టీడీపీ భావజాలం, పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయాలని సమావేశంలో వక్తలు నిర్ణయించారు. నాలుగు దశాబ్దాల పాటు టీడీపీ పాలనలో అనేక కుటుంబాలకు జరిగిన మేలును ప్రచారం చేయడమే సమావేశం ప్రధాన లక్ష్యం. టీడీపీకి ఓటేస్తే రాబోయే తరాలకు మంచి జరుగుతుందని చెప్పాలని అనుకున్నాం. కానీ సమావేశంలో నేను చేసిన ప్రసంగాన్ని వక్రీకరిస్తూ నాపై ఫిర్యాదు చేశారు. నచ్చిన పార్టీకి ప్రచారం చేసుకోవడం ప్రాథమిక హక్కు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సభ్యుడిగా నా సహచర ఎన్‌ఆర్‌ఐలను టీడీపీకి పనిచేయాలని అభ్యర్థించా. లంచాలు ఇచ్చి ప్రభావితం చేశానని చెప్పడం అవాస్తవం. ప్రభుత్వ సలహాదారులపై మేం తప్పుడు వ్యాఖ్యలు చేశామంటూ వైసీపీ నాయకులు మమ్మల్ని బెదిరిస్తున్నారు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సభ్యులుగా మేం దేశ చట్టాలను గౌరవించి, పాటిస్తాం. నేను అనేక సంవత్సరాలగా పార్టీ కోసం పనిచేస్తున్నా. నేను గత ఆరు సాధారణ ఎన్నికల్లో ప్రచారాల్లో సైతం పాల్గొన్నా. కానీ ఎన్నికల నియమ నిబంధనలను ఎన్నడూ ఉల్లంఘించలేదు’ అని జయరామ్‌ వివరించారు.

Updated Date - Apr 26 , 2024 | 07:13 AM