ఇది డ్రోన్ యుగం!
ABN , Publish Date - Oct 24 , 2024 | 03:37 AM
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.. డ్రోన్ టెక్నాలజీ రయ్మంటూ దూసుకుపోతోంది. రాబోయే రోజుల్లో ప్రతి రంగాన్నీ డ్రోన్ ప్రభావితం చేయనుంది. చేరుకోలేని దూరాల్ని,
డ్రోన్ సమ్మిట్లో బహుముఖ ప్రయోజక విహంగాలు
గుంటూరు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.. డ్రోన్ టెక్నాలజీ రయ్మంటూ దూసుకుపోతోంది. రాబోయే రోజుల్లో ప్రతి రంగాన్నీ డ్రోన్ ప్రభావితం చేయనుంది. చేరుకోలేని దూరాల్ని, అందుకోలేని ఎత్తుల్ని సులువగా చేరుకోవడమే కాకుండా.. పనులన్నీ సులభతరం చేయడంలో డ్రోన్ టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుంది. ఇటీవల వరదల సమయంలో విజయవాడ వరద బాధితులకు విశేష సేవలందించిన డ్రోన్ టెక్నాలజీ సాధారణ ప్రజా జీవితంలో అంతకుమించిన సేవలు అందిస్తోంది. కానీ ఆ వాస్తవం ప్రజలకు చేరడంలోనే సమస్య ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్లో చేపట్టిన అమరావతి డ్రోన్ సమ్మిట్ ఆ సమస్యలను పరిష్కరించింది. ఇప్పటికే విస్తరించిన డ్రోన్ టెక్నాలజీ అందిస్తున్న సేవల గురించి, భవిష్యత్ డ్రోన్లదే అనే అంశాన్ని ప్రజలకు తెలిసేందుకు అవకాశం లభించింది. ఈ డ్రోన్ సమ్మిట్లో అనేక మంది యువ ఇంజనీర్లు అనేక రకాల డ్రోన్లను ప్రదర్శించారు. రైతులకు, వ్యాపారులకు, వైద్య సేవలకు అవి ఎలా ఉపయోగపడతాయో వివరించారు.
ఇండస్ట్రియల్ ఇన్స్పెక్షన్ డ్రోన్లు..
పరిశ్రమల్లో వినియోగించేందుకు ప్రత్యేకంగా ఈ డ్రోన్ల రూపకల్పన చేశారు విశాఖకు చెందిన ప్రవీణ్ అనే యువ ఇంజనీర్. ఇవి మూడు రకాలు. యంత్రాల బయటి భాగాల్లో సమస్యలు గుర్తించడానికి ఎక్స్టర్నల్ డ్రోన్స్ను వినియోగిస్తారు. ఇవి ప్రమాదకర వాయువుల లీకేజీని గుర్తిస్తాయి. ఇన్సైడ్ డ్రోన్లు యంత్రాల లోపలి భాగాల్లోని సమస్యలను గుర్తిసాయి. ఇక పైపుల్లో ఉండే సమస్యలను కూడా గుర్తించేందుకు సూక్ష్మ డ్రోన్లను రూపొందించారు.
ఆంధ్రులు స్థాపించిన స్టార్టప్.. వ్యోమిక్..
గోదావరి జిల్లాకు చెదిన ముగ్గురు యువ ఇంజనీర్లు హేమంత్, సాయిచరణ్, హనుమ కలిసి హైదరాబాద్ కేంద్రంగా స్టార్టప్ కంపెనీ వ్యోమిక్ను ఏర్పాటు చేసి రైతుల కోసం డ్రోన్లు సప్లై చేస్తున్నారు. ఇవి పూర్తిగా బ్యాటరీతో నడిచే డ్రోన్లు. ఒకసారి చార్జింగ్కు 15 నిమిషాల సమయం పడుతుంది. ఎకరం పొలంలో స్ర్పే చేయడానికి 6, 7 నిమిషాలు సమయం సరిపోతుంది. ఇక్కడ ప్రభుత్వ ప్రోత్సాహాలు చూశాక తిరిగి ఏపీకి రావాలని నిర్ణయించుకున్నామని వ్యోమిక్ వ్యవస్థాపకులు చెప్పారు. ప్రస్తుతం 80 డ్రోన్లు ఆపరేట్ చేస్తున్నామని, 2025 నాటికి ఒక్క ఏపీలోనే 2000 డ్రోన్లు ఆపరేట్ చేస్తామని చెప్పారు.
125 కి.మీ వేగం.. 150 కి.మీ. దూరం!
తంజావూరుకు చెందిన ఏకాంత్ వైద్య సేవల కోసం ఒక డ్రోన్ను సిద్ధం చేశారు. 7 కిలోల బరువు మోయగల ఈ డ్రోన్ 125 కి.మీ వేగంతో 150 కిలోమీటర్ల వరకూ వెళ్లగలదు. మైనస్ 1 నుంచి మైనస్ 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్టోగ్రత వుండే లగేజ్ బాక్సులో మందులు, మానవ అవయవాలు కూడా భద్రం చేసుకునే వీలుంది. అత్యవసరంగా సరఫరా చేయాల్సిన మందులు, అవయవాలను ఈ డ్రోన్ ద్వారా త్వరితగతిన గమ్యస్థానాలకు చేర్చవచ్చు.
రెవెన్యూ సేవలకు.. స్కై హెప్టర్ వీటీఓఎల్
వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ (వీటీఓఎల్) అంటే డ్రోన్లాగా నిట్టనిలువుగా టేక్ ఆఫ్ అవుతుంది. ఆ తరువాత నాలుగు వైపులా ఫ్యాను మోటార్లు ఆగిపోయి విమానంలా ముందుకు వెళుతుంది. ఇది రెవెన్యూ శాఖ మ్యాపింగ్కు ఉపయోగపడుతుంది. ఈ సంస్థ తమిళనాడు ప్రభుత్వంతో అనుబంధ సేవలందిస్తోంది. ఇందులో కెమెరాలు వేగంగా ఫొటోలు తీసి భూముల సర్వేను సులభతరం చేస్తాయి.
డ్రోన్ బాల్తో సేఫ్టీ
చిన్న పిల్లలు, శిక్షణ లేకుండా డ్రోన్లు నడిపే వారు వాటిని ఢీకొట్టించే ప్రమాదం వుంది. దీంతో లక్షల రూపాయల విలువ చేసే డ్రోన్లు దెబ్బతినే ప్రమాదం వుంది. ఈ ప్రమాదాల నుంచి డ్రోన్లను రక్షించేందుకు వీలుగా శిక్షక డ్రోన్లను రూపొందించారు. డ్రోన్ చుట్టూ తేలికపాటి ప్లాస్టిక్, రబ్బర్ రక్షక వలయం వుంటుంది. దీంతో డ్రోన్ దేనికైనా గుద్దుకున్నా అది దెబ్బతినకుండా ఉంటుంది.
లాజిస్టిక్ డ్రోన్.. వరదల్లో సాయం..
ఈ డ్రోన్ను కూడా గోపీనే రూపొందించారు. దీని ద్వారా సరుకులు రవాణా చేయవచ్చు. పది కిలోమీటర్ల పరిధిలో ఫ్లిప్కార్ట్, అమెజాన్ డెలివరీలను కూడా ఇవ్వవచ్చు. వరదల సమయంలో విజయవాడలో బాధితులకు ఈ డ్రోన్ల ద్వారా ఆహారాలు, మందులు అందజేశామని గోపి చెప్పారు.
వ్యవ‘సాయం’ కోసం హైబ్రిడ్ డ్రోన్..
రైతులకు సేవలందించే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా నెప్పల్లెకు చెందిన యువ ఇంజనీర్ గోపి వెంకట కృష్ణ ఒక డ్రోన్ తయారు చేశారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన ఆయన ఎరువులు, పురుగు మందులు చల్లడానికి, విత్తనాలు వెదజల్లడానికి వీలుగా ఈ డ్రోన్ను రూపొందించారు. ఇది పెట్రోల్, బ్యాటరీతో నడుస్తుంది. ఆరు లీటర్ల పెట్రోలుతో 16 లీటర్ల పురుగుమందులను పిచికారీ చేయగలదు. ఆయిల్ అయిపోతే వెంటనే ల్యాండ్ అవడానికి వీలుగా బ్యాకప్ బ్యాటరీ ఉంటుంది.
విజ్ఞాన్ విద్వత్తు.. ఐదు డ్రోన్లు..
విజ్ఞాన్ యూనివర్శిటీ ఇంజనీరింగ్ విద్యార్థులు ఐదు రకాల డ్రోన్లు తయారు చేశారు. కోయాక్సిల్ డ్రోన్తో తక్కువ ఏరియాలో ఎక్కువ పేలోడ్ తీసుకువెళ్లేలా చేశారు. స్వామ్ టెక్నాలజీ డ్రోన్లు.. ఒకే డ్రోన్ ద్వారా ఒకేసారి అనేక డ్రోన్లను ఒక్కరే ఆపరేట్ చేసేలా రూపొందించడమే ఈ డ్రోన్ ప్రత్యేకత. వీటిలో మాస్టర్ డ్రోన్, స్లేవ్ డ్రోన్లు వుంటాయి. రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగపడే ఫస్ట్ పర్సన్ వ్యూ, అగ్రికల్చర్ డ్రోన్, 3డీ ప్రింటింగ్ డ్రోన్లనూ రూపొందించారు.
ఎస్ఆర్ఎం విద్యార్థుల స్పెషల్ డ్రోన్లు..
రాజధాని అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో బీటెక్ చదువుతున్న మణికంఠ, పుష్పక్, అజిత్.. మెడిసిన్ డ్రోన్లు రూపొందించారు. 10 కి.మీ. పరిధిలో మందులు అందజేసేలా వాటిని రూపొందించారు. వెబ్ఇంటర్ఫేజ్లో వినియోగదారుడు మందు లు ఆర్డర్ చేస్తే వారు ఇచ్చిన అడ్రె్సకు చేరవేస్తుంది. ఇది 2కిలోల వరకు సరుకులు అందించగలదు.