బాబు,నితీశ్ అండతోనే మోదీ సర్కారు
ABN , Publish Date - Nov 13 , 2024 | 04:53 AM
ఏపీ సీఎం చంద్రబాబు, బిహార్ సీఎం నితీశ్ తలుచుకుంటే మోదీ ప్రభుత్వం ఏడాది కూడా అధికారంలో కొనసాగదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

వారు తలుచుకుంటే ఏడాదిలో కూలుతుంది
టీడీపీలో చంద్రబాబుతో కలిసి పనిచేశా
‘ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డా’లో రేవంత్
న్యూఢిల్లీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబు, బిహార్ సీఎం నితీశ్ తలుచుకుంటే మోదీ ప్రభుత్వం ఏడాది కూడా అధికారంలో కొనసాగదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారిద్దరి అండతోనే నడుస్తోందన్నారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు. సోమవారం ఢిల్లీలో ‘ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డా’ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను గతంలో చంద్రబాబు, టీడీపీతో కలిసి పనిచేశానని రేవంత్ గుర్తుచేసుకున్నారు. గతంలో పనిచేసిన ఏబీవీపీ, టీడీపీతోపాటు కాంగ్రెస్ పార్టీలోని ఏ లక్షణం ఇష్టమని రేవంత్రెడ్డిని అడగ్గా....ఏబీవీపీకి దేశం పట్ల ఉన్న అంకితభావం, తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి పట్ల ఉన్న దృక్పథం, కాంగ్రెస్ అనుసరిస్తున్న సామాజిక న్యాయ విధానం తనకు ఇష్టమని రేవంత్ చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యలను కలిసి చర్చించి పరిష్కరించుకోవచ్చని రేవంత్ తెలిపారు. అందుకోసం తాము ఢిల్లీ వచ్చి కేంద్రం మధ్యవర్తిత్వాన్ని కోరనవసరం లేదన్నారు. మోదీ హయాంలో దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు.