ఆశల పల్లకిలో..
ABN , Publish Date - Jun 11 , 2024 | 12:13 AM
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి క్లీనస్వీప్ చేసి, రికార్డు సృష్టించింది. ఏడుచోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో టీడీపీ తరఫున ఆరుగురు, ఒకచోట బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఈనేపథ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే మంత్రివర్గంలో జిల్లాలో ఎంత మందికి అవకాశం వస్తుంది, ఆభాగ్యం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది.
![ఆశల పల్లకిలో..](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమాత్యయోగంపై సర్వత్రా ఉత్కంఠ
తమకే వస్తుందంటున్న కూటమి ఎమ్మెల్యేలు
అందరిలోనూ ఆశాభావం
ఎవరి లెక్కలు వారివే..
పుట్టపర్తి, జూన10(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి క్లీనస్వీప్ చేసి, రికార్డు సృష్టించింది. ఏడుచోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో టీడీపీ తరఫున ఆరుగురు, ఒకచోట బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఈనేపథ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే మంత్రివర్గంలో జిల్లాలో ఎంత మందికి అవకాశం వస్తుంది, ఆభాగ్యం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది. గెలుపొందిన ఎమ్మెల్యేల్లో సీనియారిటీ ఉందని కొందరు, సామాజిక సమీకరణాలు, మిత్రధర్మంలో తమకు మంత్రి పదవి లభిస్తుందని మరికొందరు లెక్కలు వేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఆయా నియోజకవర్గాల్లో కూటమి శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. జిల్లాలో కూటమి క్లీనస్వీ్పతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా ఈసారి మంత్రి పదవి వస్తుందన్న ధీమాలో ఉన్నారు.
సామాజిక సమీకరణాలే కీలకం
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి కుటుంబం నుంచి హిందూపురంలో హ్యాట్రిక్ సాధించిన నందమూరి బాలకృష్ణ కోరుకుంటే మంత్రి వర్గంలో చోటు సంపాదించే వారిలో మొదటి వరుసలో ఉంటారు. బాలకృష్ణ మంత్రి పదవి తీసుకుంటారనేది ఆయన ఎక్కడా బయటపడలేదు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది 2014లో మంత్రిగా పనిచేసిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నా.. ఉమ్మడి జిల్లాలో మంత్రివర్గం కూర్పులో వివిధ అంశాలతోపాటు సామాజిక సమీకణాలు కీలకం కానున్నాయి. టీడీపీలో ఆ తర్వాతి స్థానంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. జిల్లాలో పెనుకొండ, మడకశిర, ధర్మవరం, పుట్టపర్తి నుంచి కూటమి తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు తొలిసారి గెలుపొందారు. ధర్మవరం నుంచి బీజేపీ తరఫున గెలుపొందిన సత్యకుమార్ యాదవ్కు మిత్రధర్మం కోటాలో అమాత్యపదవి లభించే అవకాశం ఎక్కువగా ఉందన్న చర్చ వినిపిస్తోంది. బీసీ మహిళ కోటా కింద వస్తే పెనుకొండ నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన సవితకు అవకాశం వస్తుందన్న లెక్కలు వేస్తున్నారు. పుట్టపర్తి నుంచి టీడీపీ తరఫున ఎన్నికైన పల్లె సింధూరారెడ్డి, మడకశిర నుంచి గెలిచిన ఎంఎస్ రాజుకు సామాజిక సమీకరణాల్లో భాగంగా అ మాత్య పదవి వరిస్తుందని భావిస్తున్నారు. ఉమ్మడి జి ల్లాలో 14 స్థానాల్లో కూటమి అభ్యర్థులు క్లీనస్వీ్ప చేశారు. అనంత జిల్లాలో మంత్రి పదవి లభించే దానిని బట్టి శ్రీసత్యసాయి జిల్లాలో ఎవరన్నది తేలనుంది. జిల్లాలో సీనియర్లతోపాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ అమాత్య పదవి ఆశిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు వ స్తుందా, మిత్రధర్మంలో బీజేపీకి సర్దుబాటు చేస్తారా అనేది 12వ తేదీ న తేలనుంది.