మీసం మెలేసి చెబుతున్నా.. నామినేషన్ దాఖలు చేస్తా
ABN , Publish Date - Apr 25 , 2024 | 03:47 AM
కుల రాజకీయాలకు, అరాచక రాజకీయాలకు రాజుగా ఉన్న సీఎం జగన్ను గద్దె దించడమే మన లక్ష్యం..
అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ ప్లాన్
సీఎం నామినేషన్ వేస్తున్న రోజే నేనూ వేస్తా
జగన్ను గద్దె దించేందుకు సిద్ధం కావాలి: దస్తగిరి
పులివెందుల, ఏప్రిల్ 24: ‘‘కుల రాజకీయాలకు, అరాచక రాజకీయాలకు రాజుగా ఉన్న సీఎం జగన్ను గద్దె దించడమే మన లక్ష్యం.. మీసం మెలేసి చెబుతున్నా.. నేను నామినేషన్ దాఖలు చేస్తా’’ అని వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి పేర్కొన్నారు. బుధవారం పులివెందులలో దస్తగిరి మీడియాతో మాట్లాడారు. తన నామినేషన్ సందర్భంగా వైసీపీ అరాచకాలు సృష్టించాలని చూస్తోందని ఆరోపించారు. ‘‘పులివెందుల అసెంబ్లీ స్థానానికి జై భీమ్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేస్తున్నా. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా అడ్డంకులు సృష్టించాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని నా సహాయకులు తెలిపారు. నేను, బీటెక్ రవి నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సమయంలో టీడీపీ కండువాలు కప్పుకొని వచ్చి మాపై రాళ్ల దాడులు చేసేందుకు ప్రయత్నిస్తారని తెలిసింది. అందుకే బుధవారం నామినేషన్ దాఖలు చేయకుండా తేదీ మార్చుకున్నా. సీఎం జగన్ నామినేషన్ వేస్తున్న రోజే (25వ తేదీ) నేను కూడా వేసేందుకు సిద్ధమయ్యా. నామినేషన్ వేసేందుకు నేను పిలుచుకున్న నాయకులను, అభిమానులను ఈ అరాచక శక్తులు అడ్డుకునేందుకు చూస్తున్నాయి. వలంటీర్లు వారి వద్దకెళ్లి పింఛన్లు, పథకాలు రాకుండా చేస్తారని, వెళ్లవద్దని చెబుతున్నారు. నాతో నడిచేవారికి, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఏదైనా జరిగితే మర్యాదగా ఉండదు. పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్కుమార్ పులివెందుల వస్తున్నారు. ఆయనతో కలిసి నామినేషన్ దాఖలు చేస్తా. భయాలను పక్కనపెట్టి సామాన్యుడికి అండగా నిలవండి. నన్ను ఆశీర్వదించండి. నా నామినేషన్కు రండి’’ అని దస్తగిరి కోరారు.