ఒత్తిడి భరించలేక వైద్య విద్యార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Nov 28 , 2024 | 06:01 AM
చదువుల ఒత్తిడి భరించలేక ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అనంతపురం టౌన్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): చదువుల ఒత్తిడి భరించలేక ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన శివప్రసాద్, శారద దంపతుల కుమారుడు వీర రోహిత్(21) అనంతపురం మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. డిసెంబరులో పరీక్షల నేపథ్యంలో కాలేజీ హాస్టల్లోని ప్రత్యేక గదిలో ఒక్కడే ఉంటున్నాడు. అతని తమ్ముడు బుధవారం ఉదయం నుంచి ఫోన్ చేసినా స్పందించక పోవడంతో అనంతపురంలో తమ బంధువు ధీరజ్కు విషయం తెలియజేశాడు. ధీరజ్ కాలేజీ హాస్టల్కు వెళ్లి చూసేసరికి రోహిత్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే రోహిత్ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. తన చావుకు తానే కారణమని, ఆలోచనల నుంచి బయట పడలేకపోతున్నానని రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.