టీడీపీలోకి భారీగా చేరికలు
ABN , Publish Date - Jan 28 , 2024 | 03:04 AM
అధికార పార్టీ వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు శనివారం ఇక్కడ వేర్వేరు కార్యక్రమాల్లో టీడీపీలో చేరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వచ్చిన నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమక్షంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో చేరారు.
![టీడీపీలోకి భారీగా చేరికలు](https://media.andhrajyothy.com/media/2023/20231205/LL_f01ebd110f.jpg)
అచ్చెన్నాయుడు, లోకేశ్ సమక్షంలో చేరిన నేతలు
అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): అధికార పార్టీ వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు శనివారం ఇక్కడ వేర్వేరు కార్యక్రమాల్లో టీడీపీలో చేరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వచ్చిన నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమక్షంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో చేరారు. వీరిలో ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ మైనారిటీ విభాగం మాజీ అధ్యక్షుడు సయ్యద్ మహబూబ్, వైసీపీ యువజన విభాగం పల్నాడు జిల్లా కార్యదర్శి అంకాళ్ల రాంబాబు, ప్రముఖ వైద్యుడు శింగరాజు సాయికృష్ణ, వైసీపీ కౌన్సిలర్ గుజ్జర్లపూడి సతీశ్, వెసీపీ నేతలు ఉన్నారు. పెద్ద సంఖ్యలో ముస్లిం మైనారిటీలు తరలిరావడంతో టీడీపీ కార్యాలయం కిటకిటలాడింది. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కొందరు ప్రముఖ వైసీపీ నేతలు మరో కార్యక్రమంలో లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. జడ్పీటీసీ యడ్ల వెంకట్రావు, జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షురాలు యేళ్ల జయలక్ష్మి, దుగ్గిరాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పాటిబండ్ల కృష్ణ ప్రసాద్, దుగ్గిరాల సొసైటీ చైౖర్మన్ పాటిబండ్ల హరి ప్రసాద్ తదితర వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం ప్రారంభించి ఏడాది అయిన సందర్భంగా టీడీపీ జాతీయ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.