స్ట్రాంగ్ రూమ్ పక్కనే సీఎం సెక్యూరిటీ విందు
ABN , Publish Date - May 16 , 2024 | 04:27 AM
ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్కు కూతవేటు దూరంలో ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది విందు చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ సిద్ధం పోస్టర్లు, ఆ పార్టీ డీజే పాటలతో
![స్ట్రాంగ్ రూమ్ పక్కనే సీఎం సెక్యూరిటీ విందు](https://media.andhrajyothy.com/media/2024/20240511/9_GNT_12_0ed796b0f4.jpg)
నాగార్జున విశ్వవిద్యాలయంలో ఘటన
మంగళగిరి ఈవీఎంలు ఇక్కడే
గుంటూరు, మే 15 (ఆంధ్రజ్యోతి): ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్కు కూతవేటు దూరంలో ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది విందు చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ సిద్ధం పోస్టర్లు, ఆ పార్టీ డీజే పాటలతో హోరెత్తించారు. నాగార్జున వర్సిటీలో ఈ ఘటన జరిగింది. గుంటూరు లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే ఈవీఎం యంత్రాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఓ స్ట్రాంగ్ రూమ్లో ఉంచి బందోబస్తు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్కు సమీపంలో ఉన్న డైక్మన్ మీటింగ్ హాల్ను మంగళవారం రాత్రి సీఎం సెక్యూరిటీ సిబ్బంది విందు, వినోదాలు నిర్వహించుకునేందుకు కేటాయించారు. దీంతో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు కలవరపాటుకు గురవుతున్నారు. లోకేశ్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు ఇదే స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి. లోకేశ్ను ఓడించేందుకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఎన్నికల సమయంలో ఎన్నో కుయుక్తులు పన్నినప్పటికీ ఓటర్లు నమ్మలేదని గ్రహించి ఏదో కుట్రకు వ్యూహరచన చేస్తున్నారనే భయం టీడీపీ నేతల్లో నెలకొంది. ఈ పార్టీ నిర్వహించిన సీఎం సెక్యూరిటీ గ్రూప్ ఎస్పీ అత్తాడ బాపూజీపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. స్ర్టాంగ్ రూమ్ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఈవోను కోరారు.