Share News

‘మద్యం మాస్టర్‌’ వాసుదేవ రెడ్డిపై వేటు!

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:20 AM

ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిపై ఎన్నికల కమిషన్‌ బదిలీ వేటువేసింది. ఆది నుంచీ జగన్‌ సేవలో తరిస్తూ... ఎన్నికల వేళ మరింత బరితెగిస్తున్న ఆయనకు షాక్‌ ఇచ్చింది. కొత్త ఎండీ నియామకానికి

‘మద్యం మాస్టర్‌’ వాసుదేవ రెడ్డిపై వేటు!

బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీపై ఈసీ చర్యలు

ఆయనను పక్కకు తప్పించాలని ఆదేశం

డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి రప్పించిన జగన్‌

గడువు ముగిసినా కొనసాగింపు

మద్యం సేల్స్‌ బాధ్యతలు అప్పగింత

డిస్టిలరీలు, డిపోలు, షాపులపై ఆజమాయిషీ

తొలి నుంచీ వైసీపీ సేవలోనే ఎన్నికల వేళ మరింత బరితెగింపు

అధికార పార్టీకి అడిగినంత మద్యం

ఈసీకి ఫిర్యాదులతో చర్యలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిపై ఎన్నికల కమిషన్‌ బదిలీ వేటువేసింది. ఆది నుంచీ జగన్‌ సేవలో తరిస్తూ... ఎన్నికల వేళ మరింత బరితెగిస్తున్న ఆయనకు షాక్‌ ఇచ్చింది. కొత్త ఎండీ నియామకానికి వీలుగా ముగ్గురు ఐఏఎస్‌ల పేర్లు ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం గమనార్హం. వాసుదేవ రెడ్డి ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీసు అధికారి. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్‌ ఏరికోరి ఆయనను రాష్ర్టానికి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చారు. కీలకమైన మద్యం అమ్మకాల బాధ్యతను ఆయన చేతుల్లో పెట్టారు. అంతే... ఆ రోజు నుంచి జగన్‌ ఆదేశాలే శిరోధార్యంగా వాసుదేవ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన బేవరేజెస్‌ కార్పొరేషన్‌ పనితీరును మార్చేశారు. మద్యం వ్యాపారంపై జగన్‌ మార్కు వేయించారు. కోడ్‌ అమల్లోకి వచ్చాక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ శ్రేణులకు మద్యం ధారాళంగా అందేలా చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఎన్నికల్లో ప్రభావం చూపే కీలకమైన మద్యాన్ని వాసుదేవరెడ్డి అధికార పార్టీకి అడిగినంత ఇస్తున్నారంటూ ఇటీవల ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీనిపై ఎన్నికల కమిషన్‌ స్పందించింది. ఆయనను పక్కకు తప్పించాలని ఆదేశించింది. దీంతో... ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా వాసుదేవ రెడ్డిని తప్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. కార్పొరేసన్‌ ఎండీగా ఎంకెవరినో కాకుండా... ఐఏఎస్‌నే నియమించాలని ఈసీ నిర్ణయించుకోవడం గమనార్హం. దీనికోసం ఈసారి ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల పేర్లు ప్రతిపాదించాలని ఈసీ ఆదేశించింది. ఆ మేరకు ముగ్గురు యువ ఐఏఎస్‌ అధికారుల పేర్లను ఈసీకి పంపింది.

అధికార పార్టీకే మద్యం...

మొదటినుంచీ వైసీపీతో అంటకాగుతున్న వాసుదేవరెడ్డి ఈ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి మద్యం విషయంలో ఢోకా లేకుండా చూస్తున్నారు. షాపులు ఎలాగూ ప్రభుత్వానివే కావడంతో పలు చోట్ల వైసీపీ నేతలకు పెద్దఎత్తున మద్యం సరఫరా చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక మద్యం అమ్మకాలపై నియంత్రణ రావడంతో, ‘ఒక వ్యక్తికి ఒక్క సీసా’నే అమ్ముతున్నారు. గతేడాది ఈ తేదీన ఎంత అమ్ముతున్నారో ఇప్పుడూ అంతే అమ్మాలి. ఒకరికి ఒక సీసా చొప్పునే అమ్ముతున్నా గతేడాది కోటాను ప్రామాణికంగా తీసుకుంటే మధ్యాహ్నానికే షాపుల్లో మందు ఖాళీ అవుతోంది. గతేడాది ఒక రోజంతా అమ్మిన మద్యం... ఇప్పుడు సగం రోజులోనే ఎలా అమ్ముడవుతుందో బేవరేజెస్‌ కార్పొరేషన్‌కే తెలియాలి. కాగా మద్యం డిపోల నుంచే నేరుగా వైసీపీ నేతలకు మద్యం పంపుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించింది.

సర్వం ఆయనే....

వాస్తవానికి గతంలో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ పోస్టుకు ప్రత్యేకంగా అధికారిని నియమించేవారు కాదు. ఎక్సైజ్‌ కమిషనరే ఇన్‌చార్జ్‌ ఎండీగా వ్యవహరించేవారు. అప్పట్లో మద్యం పాలసీ రూపొందించడం, వేలం నిర్వహించడం, ఆదాయం వ్యవహారాలను కార్పొరేషన్‌ చూసేది. కానీ మద్యం విషయంలో పక్కా ప్లాన్‌ రూపొందించిన వైసీపీ ప్రభుత్వం వ్యాపారాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. అప్పుడు వాసుదేవరెడ్డిని ఎండీగా నియమించి, మొత్తం వ్యాపారాన్ని ఆయన చేతుల్లో పెట్టింది. వైసీపీ ప్రభుత్వం పైకి ‘ప్రభుత్వ మద్యం షాపుల’ పాలసీని ప్రకటించినా అంతర్గతంగా కమీషన్ల పాలసీని ప్రవేశపెట్టింది. కంపెనీలకు ఆర్డర్‌ ఇవ్వాలంటే, ప్రతి కేసుకు రూ.200 నుంచి రూ.250 వైసీపీ పెద్దలకు కమీషన్‌ చెల్లించాలి. ఈ ప్రక్రియలో కంపెనీలకు ఆర్డర్లు వాసుదేవరెడ్డి ఇస్తే, షాపుల్లో ఏం అమ్మాలనేది ఎక్సైజ్‌లో ఓ డిప్యూటీ కమిషనర్‌ చూసుకున్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎడాపెడా అప్పులు చేసిన జగన్‌ ప్రభుత్వం, బేవరెజెస్‌ కార్పొరేషన్‌నూ వదల్లేదు. మద్యం ఆదాయాన్ని చూపించి రూ.14వేల కోట్లు అప్పులు చేసింది. ఈ ప్రక్రియలో ఎండీ వాసుదేవరెడ్డి కీలకంగా వ్యవహరించారు.

టీడీపీ హయాంలో మద్యం విధానంపై ఫిర్యాదు చేసిందీ, చంద్రబాబుపై కేసు పెట్టించిందీ వాసుదేవ రెడ్డే. స్వయంగా ఆయనే సంతకాలు చేసి ఫిర్యాదును సీఐడీ చేతుల్లో పెట్టారు. చంద్రబాబును మరిన్ని రోజులు జైల్లో ఉంచాలని వైసీపీ చేసిన కుట్రకు సహకరించారు.

వైసీపీతో సాన్నిహిత్యం

2008 బ్యాచ్‌కు చెందిన వాసుదేవరెడ్డి గతంలో గుంతకల్లు రైల్వే డివిజన్‌లో పనిచేశారు. అప్పట్లో ఆయనకు సీఎం కార్యాలయంలో పనిచేసే కేఎన్‌ఆర్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచీ ఆయన రైల్వేకు సంబంధించి విషయాల్లో వైసీపీకి సమాచారం చేరవేస్తూ, పార్టీ నేతలకు సన్నిహితంగా ఉంటూ వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోటలో జగన్‌ కుటుంబంపై జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించిన సమాచారం ముందుగానే జగన్‌కు ఇచ్చారనే ప్రచారం ఉంది. ఇలా తొలినుంచీ వైసీపీతో పలు రకాలుగా సన్నిహితంగా ఉంటూ వచ్చిన వాసుదేవరెడ్డిని అధికారంలోకి వచ్చిన వెంటనే డిప్యుటేషన్‌పై రాష్ర్టానికి తీసుకొచ్చారు. మొదటి మూడేళ్ల డిప్యుటేషన్‌ గడువు ముగిసినా పైస్థాయిలో సిఫారసు చేయించి మరీ మరో మూడేళ్లకు కొనసాగించేలా కేంద్రం నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు.

Updated Date - Apr 17 , 2024 | 03:20 AM