బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Jul 27 , 2024 | 03:03 AM
ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.
ద్రోణి ప్రభావంతో కోస్తా, సీమల్లో వర్షాలు
విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్యంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా పయనించనుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. కాగా దక్షిణ ఒడిశా మీదుగా తూర్పు, పడమరగా కొనసాగుతున్న ఉపరిలతల ద్రోణి ప్రభావంతో శుక్రవారం కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ముంబైలో రికార్డు స్థాయి వర్షపాతం
ముంబైను వర్షాలు ముంచెత్తుతున్నాయి. జూలై 1నుంచి గురువారం వరకు ముంబైలో అసాధారణంగా 1,543.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. నెలాఖరులోగా మరికొన్ని రోజులు అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.