మల్లన్న సన్నిధిలో లోకేశ్
ABN , Publish Date - Feb 02 , 2024 | 03:07 AM
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దంపతులు కుమారుడు దేవాన్ష్తో కలసి గురువారం దర్శించుకున్నారు.
![మల్లన్న సన్నిధిలో లోకేశ్](https://media.andhrajyothy.com/media/2023/20231205/vvvv_cb0eda3607.jpg)
కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు
శ్రీశైలం, ఫిబ్రవరి 1: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దంపతులు కుమారుడు దేవాన్ష్తో కలసి గురువారం దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంటకు చేరుకున్న వారికి మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిలు బీసీ జనార్దన్రెడ్డి, భూమా అఖిలప్రియ తదితరులు స్వాగతం పలికారు. రోడ్డు మార్గాన లోకేశ్ దంపతులు సాక్షిగణపతి ఆలయం చేరుకొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శ్రీశైలం ప్రధానాలయం రాజగోపురం వద్ద ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో రత్నగర్భ గణపతిని దర్శించుకున్న లోకేశ్... మల్లికార్జున స్వామివారికి అభిషేకం, భ్రమరాంబికా దేవికి కుంకుమార్చన జరిపించారు. ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో లోకేశ్ దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం లోకేశ్ శ్రీశైలం నుంచి సున్నిపెంట హెలిప్యాడ్కు చేరుకుని అక్కడినుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.