సచివాలయంలో మద్యం, రేషన్ బియ్యం
ABN , Publish Date - Apr 22 , 2024 | 02:41 AM
ప్రజలకు అన్ని రకాల సేవలందించేందుకే సచివాలయాలు ఏర్పాటు చేశామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం ఆ సచివాలయాలనే అక్రమాలకు అడ్డాగా వాడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
![సచివాలయంలో మద్యం, రేషన్ బియ్యం](https://media.andhrajyothy.com/media/2024/20240413/9_NLR_3_ae1bc188a8.jpg)
‘సీ విజిల్’లో ఫిర్యాదుతో పట్టివేత
కావలి, ఏప్రిల్ 21: ప్రజలకు అన్ని రకాల సేవలందించేందుకే సచివాలయాలు ఏర్పాటు చేశామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం ఆ సచివాలయాలనే అక్రమాలకు అడ్డాగా వాడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లా కావలి పట్టణ బుడంగుంట సచివాలయంలో ఆదివారం మధ్యాహ్నం 43 మద్యం సీసాలు, 9 బస్తాల రేషన్ బియ్యం నిల్వలను అధికారులు గుర్తించారు. సచివాలయ సిబ్బం ది, వలంటీర్ల సాయంతో స్థానిక వైసీపీ నాయకులు మద్యం సీసాలు నిల్వ ఉంచారనే అనుమానంతో స్థానికులు సీవిజిల్ యాప్ ద్వారా ఆదివారం ఫిర్యాదు చేశారు. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. తాను గూడూరులో ఉన్నట్టు సచివాలయ అడ్మిన్ ఫోన్లో తెలపడంతో, పోలీసుల సాయంతో సచివాలయ తలుపులు పగలగొట్టి తనిఖీ చేశారు. ఒక బస్తాలో 43 మద్యం సీసాలను గుర్తించారు. మరో గదిలో 9 బస్తాల రేషన్ బియ్యంతోపాటు మరో రెండు చిన్న బస్తాలలో బియ్యం మూటలను గుర్తించి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్కుమార్, సీఐ శ్రీనివాసులుకు సమాచారం ఇవ్వడంంతో వారు స్వాధీనం చేసుకున్నారు.