Share News

YCP Liquor Scam : ‘కిక్కు’.. దించుతున్నారు

ABN , Publish Date - Jun 08 , 2024 | 04:08 AM

ఎన్నికల సమయంలో మద్యం సరఫరాలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో... ఏపీ బేవరేజెస్‌ ఎండీ వాసుదేవరెడ్డిని ఈసీ పక్కకు తప్పించింది.

YCP Liquor Scam : ‘కిక్కు’.. దించుతున్నారు

ఏపీ బేవరేజెస్‌ మాజీ ఎండీపై కేసు

ఫైళ్లు ‘ఎత్తుకెళుతూ’ దొరికిన వాసుదేవరెడ్డి

సామాన్యుడి ఫిర్యాదుతో సీఐడీ కేసు

హైదరాబాద్‌లోని నివాసంలో సోదాలు

విచారణ... కీలక సమాచారం లభ్యం

వైసీపీ లిక్కర్‌ స్కామ్‌లో ఆయనదే కీలక పాత్ర

నూతన మద్యం విధానం పేరుతో వింత బ్రాండ్లు ప్రవేశపెట్టి...

అవినీతి ‘కిక్కు’తో వేల కోట్లు వెనకేసుకున్నారు! ఇప్పుడు ఈ

అవినీతి తీగ లాగడం మొదలైంది. ఇక... డొంక కదలడమే

మిగిలింది. ఏపీ బేవరేజెస్‌ ఎండీ హోదాలో మద్యం కొనుగోళ్లు, అమ్మకాల్లో కీలక పాత్ర పోషించిన వాసుదేవ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కీలకమైన ఫైళ్లను తీసుకెళ్లారంటూ ఆయనపై

సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ వెంటనే... హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోదాలు కూడా జరిపింది.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఎన్నికల సమయంలో మద్యం సరఫరాలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో... ఏపీ బేవరేజెస్‌ ఎండీ వాసుదేవరెడ్డిని ఈసీ పక్కకు తప్పించింది. అయితే... వైసీపీ ఓటమి తర్వాత, గురువారం ఆయన తన వెంట కొన్ని కీలక ఫైళ్లు తీసుకెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయం నుంచి అనుమానాస్పద రీతిలో ఫైళ్లు తీసుకెళుతుండగా చూశానంటూ.. గద్దె శివకృష్ణ అనే వ్యక్తి విజయవాడలోని నున్న పోలీసులకు సమాచారం అదించారు. వారు స్పందించకపోవడంతో సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆయన కథనం ప్రకారం... గురువారం ప్రసాదంపాడు ప్రాంతంలో ఉన్న ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ముందు నుంచి శివకృష్ణ స్నేహితుడితో కలిసి వాహనంలో వెళుతున్నారు. అక్కడ ఆగిఉన్న ఏపీ 39 ఎన్‌క్యూ 6666 నంబరు గల కారులో కొన్ని ఫైళ్లు, కంప్యూటర్‌ పరికరాలు, ఇతర పత్రాలను ఎక్కిస్తుండటం గమనించారు. తన స్నేహితుడితో కలిసి కొంత దూరం వాహనాన్ని వెంబడించారు. ఆ తర్వాత... ఫైళ్లు తీసుకెళ్లిన వ్యక్తి వాసుదేవ రెడ్డి అని తెలసుకుని, నున్న పోలీసులకు తెలియజేశారు. వారు పట్టించుకోక పోవడంతో మంగళగిరి సీఐడీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం డీఎస్పీ శ్రీనివాసరావు ఎఫ్‌ఐఆర్‌(17/2024) నమోదు చేశారు. ఐపీసీ 427, 397, రెడ్‌ విత్‌ 120(బి) కింద కేసు పెట్టారు. దర్యాప్తునకు ముగ్గురు సీఐల నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దించారు.


హైదరాబాద్‌లో సోదాలు...

హైదరాబాద్‌ నార్సింగిలోని పౌలోమీ గేటెడ్‌ టౌన్‌షి్‌పలో ఉంటున్న వాసుదేవరెడ్డి నివాసానికి సీఐడీ బృందం వెళ్లింది. 12 మంది సభ్యుల బృందం శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు జరిపింది. ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఫైళ్లు, హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకుంది. వాసుదేవ రెడ్డిని ప్రశ్నించి కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. మద్యంషాపుల్లో డిమాండ్‌ ఉన్న కొన్ని మద్యం కంపెనీలకు ఆర్డర్లు ఎందుకు ఆపేశారు.. పేరుకూడా వినని కొన్ని కంపెనీల మద్యాన్ని భారీ ధరలకు ఎవరి ఆదేశాల మేరకు విక్రయించారని ఆరా తీశారు.

డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి...

తెలంగాణకు చెందిన వాసుదేవ రెడ్డి రైల్వేలో ఐఆర్‌టీఎస్‌ అధికారి. అనంతపురం జిల్లా గుంతకల్లులో పనిచేస్తూ వైసీపీ నేతలతో సంబంధాలు పెంచుకున్నారు. జగన్‌ ఓఎ్‌సడీ కృష్ణమోహన్‌రెడ్డితో సాన్నిహిత్యం బాగా పెరిగింది. 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చారు. ఆయనకు జగన్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ అప్పగించారు. ఎన్నికల సమయంలో వాసుదేవరెడ్డి వైసీపీ నేతలకు పూర్తిస్థాయిలో మద్యం అందుబాటులో ఉంచారు. డిపోల నుంచే ట్రక్కుల్లో రవాణా చేయించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. దీంతో ఆయనను ఈసీ పదవి నుంచి తప్పించింది. వాసుదేవరెడ్డి మామ మారెళ్ల పుల్లారెడ్డి. ఆయన... వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు వియ్యంకుడు. ఆయన స్వగ్రామమైన ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాసుదేవ రెడ్డి అక్రమార్జనలో కొంత భాగం ఇక్కడ భూములపై పెట్టుబడి పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. 2022 సెప్టెంబరులో వాసుదేవరెడ్డి భారీగా భూములు కొన్నట్లు సమాచారం. సుమారు 40 ఎకరాల భూమిని తన మామ నుంచి గిఫ్ట్‌ డీడ్‌ రూపంలో పొందారు. ఆ తర్వాత 2023 ఏప్రిల్‌లో సుమారు 25 ఎకరాల భూమిని పుల్లారెడ్డి కొనుగోలు చేశారు. సీఐడీ దీనిపైనా దృష్టి సారించే అవకాశముంది.

Updated Date - Jun 08 , 2024 | 04:53 AM