‘జగనన్న’ ట్యాబ్లతో పిల్లాటలు!
ABN , Publish Date - Jan 05 , 2024 | 04:31 AM
ఇది సోషల్ మీడియాలో... మరీ ముఖ్యంగా ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ అయిన వీడియో! ఆరా తీయగా...
![‘జగనన్న’ ట్యాబ్లతో పిల్లాటలు!](https://media.andhrajyothy.com/media/2023/20231205/ff_b8b94b8d94.jpg)
గేమ్స్ ఆడుకుంటున్నామంటూ వీడియో
సోషల్ మీడియాలో హల్చల్
‘హాయ్... జగనన్న ట్యాబులో గేమ్ ఆడుతున్నా. ఇదిగో చూడండి’... అని ఓ కుర్రాడి దిలాసా!
‘నేనూ ఆడుతున్నా. జగనన్న ట్యాబు ఇచ్చాడు. హెచ్ఎంకు చెబుతావో, వాళ్ల తాతకు చెప్పుకుంటావో చెప్పుకో. నాకు భయం లేదు’’... అని మరో పిల్లాడి తెగింపు!
‘‘ఇదిగో చూడు! నేను ఏం ఆడుతున్నానో చూపించు’’ అంటూ ట్యాబ్ను మరింత క్లియర్గా చూపించిన పిల్లోడు!
ఇది సోషల్ మీడియాలో... మరీ ముఖ్యంగా ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ అయిన వీడియో! ఆరా తీయగా... శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం బొరిగివలసలో దీని మూలాలు తేలాయి. ఆ ఊరి పాఠశాల విద్యార్థులు ఐదారుమంది బైజూస్ ట్యాబ్లలో గేమ్స్ను డౌన్లోడ్ చేయించుకుని... ఓచోట కూర్చుని ఆడుతున్నారు. దీనిని మరొకరు వీడియో తీస్తుండగా... ‘మాకేం భయంలేదు. ఇవి జగనన్న ట్యాబ్లు. గేమ్స్ ఆడుకుంటున్నాం’ అని చెప్పారు. బైజూస్ కంటెంట్ నింపిన ట్యాబ్లు ఇచ్చేసి, విద్యారంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు ఘనంగా చెప్పుకొంటున్నారు. ‘‘బైజూస్ ట్యాబ్లకు లాక్ సిస్టమ్ ఉంటుంది. అందులో ఉన్న కంటెంట్ను చదువుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. విద్యార్థులకు అవసరమైన 5 యాప్స్ మాత్రమే పని చేస్తాయి. మూడంచెల రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఇతర యాప్స్ వాడలేరు’’ అని అడ్డగోలు వాదన చేస్తున్నారు. నిజానికి... ఈ ట్యాబ్లను అన్లాక్ చేయడం చాలా సులభమని, ఎలాంటి యాప్లనైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చునని టెక్ నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పుడు... శ్రీకాకుళం జిల్లాలో పిల్లలు బైజూస్ ట్యాబుల్లో ఆడుకుంటున్న దృశ్యాలు బయటపడ్డాయి. ప్రభుత్వ పెద్దలు ఇప్పుడేమంటారో!
- నరసన్నపేట