‘కోటా’ అమలులో కుదుపు
ABN , Publish Date - Jan 18 , 2024 | 04:10 AM
రిజర్వేషన్ల అమలు విధానంలో స్టేట్ సబార్డినేట్ రూల్స్ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మహిళలకు కొంత మేర నష్టం
సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో సవరణ
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రిజర్వేషన్ల అమలు విధానంలో స్టేట్ సబార్డినేట్ రూల్స్ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇప్పటి వరకు రూల్స్లో మహిళలకు సంబంధించి రోస్టర్ పాయింట్ల పక్కన ‘ఉమెన్’ అని ఉండగా, సవరణలో ఈ పదాన్ని తొలగించారు. ప్రస్తుత విధానంతో పోల్చుకుంటే ఈ సవరణతో మహిళలకు కొంతమేర నష్టం జరగనుంది. ఇకనుంచి హారిజంటల్ రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి. మహిళలు, దివ్యాంగులు, క్రీడాకారులు, ఎక్స్సర్వీ్సమెన్కు అమలు చేస్తున్న హారిజంటల్ రిజర్వేషన్లు ప్రత్యేకమైనవి కావని, రెగ్యులర్(వర్టికల్) రిజర్వేషన్లలో అంతర్భాగమేనని ప్రభుత్వం వెల్లడించింది. ఆ నాలుగు విభాగాల వారికి రోస్టర్లో ఉన్న పాయింట్లను తొలగించి, కొత్తగా స్లాట్ విధానం తెచ్చింది. దాని ప్రకారమే ఆ విభాగాలకు భర్తీ ప్రక్రియ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో మహిళలకు ప్రాతినిధ్యం తగ్గుతుంది.
సామాజిక వర్గాల వారీగా
దివ్యాంగులకు ఉన్న 4ు రిజర్వేషన్లను ఇప్పటి వరకు ఓపెన్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఓబీసీ ఏ వర్గానికి చెందిన వారైనా ఓపెన్ కోటా కిందే నియమిస్తున్నారు. దీనివల్ల ఓపెన్ కోటా పరిమితి తగ్గిపోతోంది. తాజా జీవోలో దివ్యాంగులకు వారి సామాజికవర్గాల వారీగా రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఓపెన్ కోటాకు కొంత రిలీఫ్ దక్కుతుంది. అదేవిధంగా క్రీడాకారులకు ఉన్న 2ు రిజర్వేషన్లను, ఎక్స్ సర్వీ్సమెన్కు ఉన్న 2ు రిజర్వేషన్లను కూడా ప్రస్తుతం ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. ఇకపై వీటిని కూడా వారి సామాజిక వర్గాల ప్రాతిపదికన రిజర్వేషన్ కోటాలోనే భర్తీ చేస్తామని పేర్కొంది. దీనికి అనుగుణంగా వారికి ఉన్న రోస్టర్ పాయింట్లను ఆగస్టులోనే తొలగించారు. దివ్యాంగులను 4 విభాగాలుగా చేశారు. మొదటి విభాగంలో కంటి సంబంధిత లోపాలున్న వారుంటారు. వీరికి 1నుంచి 25పోస్టుల స్లాట్ కేటాయించారు. రెండో విభాగంలో వినికిడి లోపాలున్నవారికి 26నుంచి 50 వరకు, మూడో విభాగంలో శారీరక వైకల్యం(కాళ్లు, చేతులు వంటివి) ఉన్నవారికి 51 నుంచి 75 వరకు, నాలుగో విభాగంలో పైమూడు విభాగాల కిందకు రాని లోపాలున్న వారికి(ఆటిజం, మల్టిపుల్ డిజెబిలిటీస్) 76 నుంచి 100 పోస్టుల వరకు స్లాట్లు కేటాయించారు.
మహిళల కోటాలో మార్పులు
మహిళలకు 33ు రిజర్వేషన్ ఉంది. ఈ రిజర్వేషన్ను అటు కోటాలోను, మెరిట్ ప్రకారం ఓపెన్ కేటగిరీలోనూ భర్తీ చేస్తున్నారు. ఇకపై మెరిట్ లిస్టు ప్రకారం ఓపెన్ కేటగిరీలో భర్తీ అయిన మహిళలు 33ు కోటాకు సరిపడా ఉంటే ప్రత్యేకించి కోటా అమలు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది. మెరిట్ లిస్టు ప్రకారం చేసిన భర్తీలో మహిళా ప్రాతినిధ్యం 33ు లేనిపక్షంలో లిస్టులో ఎక్కడ మహిళలున్నా కోటా మేరకు భర్తీచేయాలని పేర్కొంది. ఉదాహరణకు 10 పోస్టుల్లో కోటా ప్రకారం మూడు పోస్టులను మహిళలతో భర్తీ చేయాల్సి వచ్చినప్పుడు, మెరిట్ ద్వారానే ముగ్గురు మహిళలు ఆ పోస్టులు కైవసం చేసుకుంటే వీరికి రోస్టర్పాయింట్లు ఇవ్వరు. ఒకవేళ మూడు పోస్టులకుగాను కేవలం ఒక్కరే మెరిట్ ద్వారా వచ్చినప్పుడు ఆ పది పోస్టుల్లో చివరి రెండు పోస్టులు 9, 10 పోస్టులను మహిళలకు కేటాయించి మెరిట్ లిస్ట్లో వారెంత దిగువన ఉన్నా సరే భర్తీ చేస్తారు.
ఓపెన్ కోటా కాకుండా
ప్రస్తుతం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీలకు 25, ముస్లింలకు 4, ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ కోటాలున్నాయి. మొత్తం కోటా 60శాతం, 40 శాతం ఓపెన్ కోటా కింద ఉన్నాయి. వీటిని వర్టికల్ రిజర్వేషన్గా పేర్కొంటున్నారు. ఇవికాకుండా మహిళలకు 33 శాతం, దివ్యాంగులకు 4శాతం, క్రీడాకారులకు 2శాతం, ఎక్స్ర్వీ్సమెన్కు 2శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. మొత్తం 41శాతం. వీటిని హారిజంటల్ రిజర్వేషన్లుగా పేర్కొంటున్నారు. వర్టికల్ రిజర్వేషన్ల కోటా 60 శాతం పోను, మిగిలిన 40శాతం ఓపెన్లోనే హారిజంటల్ రిజర్వేషన్ల ప్రకారం పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీంతో ఓపెన్ కోటాకు పెద్దగా చాన్స్ ఉండడంలేదు. హారిజంటల్ రిజర్వేషన్లను సామాజిక వర్గాల వారీగా ఆయా రిజర్వేషన్ల కోటాలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అన్నిశాఖల అధికారులతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి ఈ జీవో ఇచ్చినట్టు తెలుస్తోంది.