Share News

జగన్‌వి హత్యా రాజకీయాలు

ABN , Publish Date - Apr 09 , 2024 | 04:38 AM

‘‘ప్రజలకు మేలు చేయాలని జగన్‌కు ఓట్లు వేసి గెలిపిస్తే హత్యా రాజకీయాలు నడిపిస్తున్నాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా శాండ్‌ మాఫియా ల్యాండ్‌

జగన్‌వి హత్యా రాజకీయాలు

వివేకాను చంపిన అవినాశ్‌ రెడ్డికే మరోసారి ఎంపీ టికెట్‌ ఇచ్చారు

మావి నిందలు కావు.. వాస్తవాలు

సీబీఐ చెప్పినవే మేం చెబుతున్నాం

రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా శాండ్‌, ల్యాండ్‌, లిక్కర్‌ మాఫియా

జగన్‌.. వైఎస్‌ వారసుడు కానేకాదు

నమ్మి నడిస్తే నడిరోడ్డున వదిలేశాడు

పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్‌

వివేకాను చంపి మమ్మల్నిరోడ్లపాల్జేశారు : సునీత ఆగ్రహం

కడప, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజలకు మేలు చేయాలని జగన్‌కు ఓట్లు వేసి గెలిపిస్తే హత్యా రాజకీయాలు నడిపిస్తున్నాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా శాండ్‌ మాఫియా ల్యాండ్‌ మాఫియా, లిక్కర్‌ మాఫియా నడుస్తున్నాయి’’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచార బస్సు యాత్రలో భాగంగా దివంగత వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీతతో కలిసి సోమవారం ఆమె ఉమ్మడి కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం, దువ్వూరు, ఖాజీపేట, మైదుకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల ఏమన్నారంటే.. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లు నిద్రపోయి చివరకు 6 వేల ఉద్యోగాల కోసం డీఎస్సీ విడుదల చేశారు. జగన్‌ వైఎస్సార్‌ వారసుడు కానేకాదు. సొంత బాబాయిని చంపిన వారిని కాపాడుతున్నాడు. అవినాశ్‌ నిందితుడని సీబీఐ తేల్చింది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ అవినాశ్‌పై నేను, సునీత కలిసి అభాండాలు వేశామన్నారు. ఆయన తెగ బాధగా ఉందట. అయ్యా ఎమ్మెల్యే గారూ.. మేం నిందలు వేయలేదు. సీబీఐ చెప్పిందే చెబుతున్నాం. హత్య జరిగినప్పుడు మాకు తెలియదు. దస్తగిరి లాంటి హంతకుడిని పట్టుకుని ఆధారాలు పెడితే తప్ప మాకు అర్థం కాలేదు. సీబీఐ చెబితే తప్ప మాకు తెలియలేదు. దారుణ హత్య వెనుక కుట్రను సీబీఐ ఛేదిస్తే కానీ దానివెనుక అవినాశ్‌ ఉన్నాడని తెలియలేదు. సీబీఐ వెల్లడించిన ఆధారాలతోనే మాట్లాడాం. ఐదేళ్లుగా హంతకుడు అవినాశ్‌రెడ్డిని కాపాడుతూ వచ్చారు. మళ్లీ హంతకుడికి ఎంపీ సీటు ఎందుకు ఇచ్చాడో జగనే చెప్పాలి. సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారు. ఒక పక్క న్యాయం, మరో పక్క అధర్మం. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చెప్పాలి. మీ బాధ్యత నాపై వేసుకుంటా. అని షర్మిల వ్యాఖ్యానించారు. వివేకా కుమార్తె సునీత మాట్లాడుతూ.. ‘‘వివేకాను హత్య చేసి మమ్మల్ని రోడ్డుపాలు చేశారు. ఈ దారుణ హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసు’’ అని విమర్శించారు.

అభివృద్ధి ఏదంటే..

లిక్కర్‌ షాపులు చూపుతున్న జగన్‌

దువ్వూరులో నిర్వహించిన ప్రచార సభలో ఓ వైసీపీ నేత ‘జై జగన్‌’ అంటూ కవ్వింపు చర్యలకు దిగడంతో వైఎస్‌ షర్మిల ఆయనకు దీటైన సమాధానం చెప్పారు. నినాదాలు చేస్తున్న నేతను దగ్గరకు పిలిచి.. ‘‘నీకు దమ్ముంటే జగన్‌ ఏం చేశాడో చెప్పు’’ అని మైకు ఇచ్చారు. దీంతో ఆయన మైకు తీసుకుని ‘‘మీకు వ్యక్తిగతంగా కుటుంబ సమస్యలు ఉన్నాయి., మీరు తెలంగాణలో ఉంటారు. జగన్‌ మాకు ఉన్నాడు. చాలు’’ అన్నాడు. దీనికి ప్రతిగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘నేను కూడా నీమాదిరి జై జగనన్న అనుకున్నా. తర్వాత తెలిసింది. అదే జగన్‌ చెల్లెళ్లను రోడ్డున పడేశాడు. అదే జగన్‌ మడమ తిప్పాడు. జగనన్నకు ఓటు వేయండి, బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెప్పిస్తా అని చెప్పా. వచ్చిందా హోదా? ఇదే జగన్‌.. మద్య నిషేధం చేస్తానని చెప్పమ్మా అంటే.. అదే మాట ప్రతి చెల్లికీ చెప్పా. ఈ రోజు అదే జగన్‌ మద్య నిషేధం చేయలేదు. అదే జగన్‌ ఈ రోజు మద్యం అమ్ముతున్నాడు. అయ్యా జగన్మోహన్‌రెడ్డిగారు వాగ్దానాలన్నీ ఎక్కడ నెరవేర్చారయ్యా.. అంటే ‘అవిగోమ్మా లిక్కర్‌ షాపులు’ అని చూపిస్తున్నారు. ఇందుకేనా గెలిపించింది’’ అని షర్మిల నిప్పులు చెరిగారు.

Updated Date - Apr 09 , 2024 | 04:38 AM