జగన్ తల్లీ వైసీపీ ఓటమినే కోరుతున్నారు: ఆనం
ABN , Publish Date - May 12 , 2024 | 03:57 AM
‘సీఎం జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి పరోక్షంగా వైసీపీ పరాజయాన్ని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం’

ఆత్మకూరు, మే 11: ‘సీఎం జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి పరోక్షంగా వైసీపీ పరాజయాన్ని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం’ అని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జగన్ తల్లి విజయలక్ష్మి పరోక్షంగా వైసీపీ పరాజయాన్ని కోరుకుంటోంది. అందుకు కడప జిల్లా ప్రజలకు ఆమె పంపిన వాట్సాప్ సందేశమే ప్రత్యక్ష నిదర్శనం. సీఎం జగన్, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఇద్దరూ ఆర్థిక నేరగాళ్లు. వారికి ఓటేసి మోసపోవద్దు. విజయసాయిది నేర చరిత్ర కలిగిన కుటుంబం. ఆయన, ఆయన తండ్రి సుందరరామిరెడ్డి ఏ-2 ముద్దాయిలు. హత్యా నేరాలు, దొంగతనం కింద కేసులు, వితంతు మహిళల ఆస్తులను ఆక్రమించడానికి ప్రయత్నించడమే కాకుండా, ఆఖరికి చింతచెట్లును పంచుకోవడంలో దారుణాలకు పాల్పడ్డారు. రైతుల ధాన్యపురాశులను కూడా ఎత్తుకెళ్లిన నేర చరిత్ర విజయసాయి కుటుంబానిది. అలాంటి వ్యక్తిని ఓడించి జగన్కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. నాపైన, వీపీఆర్పైన ఎలాంటి కేసులూ లేవు’ అని అన్నారు.