మాదిగలను దగా చేసిన జగన్
ABN , Publish Date - May 07 , 2024 | 04:04 AM
వైఎ్స.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దళితులను దగా చేశాడని, అలాంటి వ్యక్తిని మరోసారి గెలిపిస్తే దళితుల సంక్షేమానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.
వైసీపీకి ఓటు వేస్తే దళితుల సంక్షేమానికి ముప్పు: మందకృష్ణ
అనంతపురం అర్బన్/ఆలూరు, మే 6: వైఎ్స.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దళితులను దగా చేశాడని, అలాంటి వ్యక్తిని మరోసారి గెలిపిస్తే దళితుల సంక్షేమానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమవారం ఆయన అనంతపురం, కర్నూలు జిల్లా ఆలూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతపురంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో మాదిగలతోపాటు అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఆలూరు టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ... నాలుగున్నర ఏళ్ల జగన్ పాలనలో దళితులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. దళితుల సంక్షేమానికి కేటాయిస్తున్న సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాదిగలకు న్యాయం చేసే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. ఎన్డీయే కూటమి పార్టీలైన బీజేపీ, జనసేన, టీడీపీలకు మాదిగలు అండగా ఉండాలని సూచించారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వారం రోజుల పాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కష్టపడాలన్నారు.