Share News

‘వైఎస్‌ఆర్‌’ను ముంచిన జగన్‌

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:36 AM

జగన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని మూడు వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ ఆక్షేపించారు.

‘వైఎస్‌ఆర్‌’ను ముంచిన జగన్‌

ఐదేళ్ల అవినీతితో రాష్ట్రం ధ్వంసం

కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసి మోసం

ఇసుక, ల్యాండ్‌, మైన్‌, లిక్కర్‌ మాఫియాకు అడ్డా

ఎన్డీయే ప్రభంజనంతో చంద్రబాబు సీఎం అవుతారు

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌

అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): జగన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని మూడు వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ ఆక్షేపించారు. విజయవాడలో గురువారం కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని పేరు పెట్టుకున్న జగన్‌ రెడ్డి ఆ యువత(వై)కు ఉద్యోగాలివ్వకుండా.. శ్రామిక(ఎస్‌) వర్గాలకు పనిలేకుండా.. రైతు(ఆర్‌)లను అన్నివిధాలా మోసం చేశారని వివరించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలకు జగన్‌ స్టిక్కర్‌ వేసుకుని రాష్ట్ర ప్రజల్ని ఐదేళ్లుగా మోసం చేశారని విమర్శించారు. ప్రధాన మంత్రి పోషణ్‌ అభియాన్‌(జగనన్న గోరుముద్ద), పీఎం స్వానిధి(జగనన్న తోడు), పీఎం ఆవాస్‌ యోజన(జగనన్న కాలనీ), వైఎ్‌సఆర్‌ ఆరోగ్య శ్రీ(ఆయుష్మాన్‌ భారత్‌).. ఇలా చెబుతూ పోతే జగన్‌ పేరుతో అందిస్తోన్న సంక్షేమ పథకాల్లో కేంద్రానివే ఎక్కువగా ఉన్నాయని వివరించారు. విశాఖ రైల్వేజోన్‌ కోసం ఎన్నిసార్లు అడిగినా భూమి ఇవ్వకుండా ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేనందున గడిచిన ఐదేళ్లు రాష్ట్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని తెలిపారు. ఏపీ అన్నివిధాలా వెనుకబడిందన్నారు. ఇసుక, ల్యాండ్‌, మైన్‌, లిక్కర్‌ మాఫియాకు అడ్డాగా మారిందని చెప్పారు. కేంద్రం ఇళ్లు మంజూరు చేసినా.. పేదలకు నిర్మించి ఇవ్వలేదని, నిధులిచ్చినా పోలవరాన్ని పూర్తి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభంజనంతో చంద్రబాబు సీఎం అవుతారని, డబులింజన్‌ సర్కార్‌తో రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతుందని తెలిపారు. ప్రత్యేక హోదా అంశంపై ఇప్పటికే పలుమార్లు స్పష్టత ఇచ్చామని, ప్యాకేజీ ఇతరత్రా మార్గాల్లో రాష్ట్రానికి ఇవ్వాల్సినంత ఇచ్చామని తెలిపారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం మోదీ, బాబు, పవన్‌ కూటమిగా ఏర్పడ్డారని, వచ్చే ఐదేళ్లు ప్రగతి పథమేనని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని గాంధీ కుటుంబం తమకు అనుకూలంగా పలుమార్లు మార్చుకుందని, తాము మార్చాలనుకుంటే ఇప్పుడైనా మెజారిటీ ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే ముందుకెళతామని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ తప్ప మతం ఆధారంగా పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పారు.

Updated Date - Apr 26 , 2024 | 04:39 AM