శ్రీశైలం భద్రమేనా..?
ABN , Publish Date - Aug 13 , 2024 | 03:30 AM
తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో శ్రీశైలం జలాశయం ఎంతవరకు భద్రంగా ఉందన్న ప్రశ్న తలెత్తుతోంది. శ్రీశైలం డ్యాం సహా వివిధ ప్రాజెక్టు ప్రాజెక్టుల భద్రత, నిర్వహణపై కేంద్ర జలవనరుల శాఖ 2014 సెప్టెంబరు 23న ఆయా రాష్ట్రాల ఇంజనీరింగ్ నిపుణులతో సమావేశం నిర్వహించింది.
కర్నూలు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో శ్రీశైలం జలాశయం ఎంతవరకు భద్రంగా ఉందన్న ప్రశ్న తలెత్తుతోంది. శ్రీశైలం డ్యాం సహా వివిధ ప్రాజెక్టు ప్రాజెక్టుల భద్రత, నిర్వహణపై కేంద్ర జలవనరుల శాఖ 2014 సెప్టెంబరు 23న ఆయా రాష్ట్రాల ఇంజనీరింగ్ నిపుణులతో సమావేశం నిర్వహించింది. ఈ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన ఎక్స్పర్ట్ కమిటీలు అధ్యయనం చేశాయి. 2020 ఫిబ్రవరి 25న జలసంఘం మాజీ చైర్మన్, డ్యాం భద్రత నిపుణుడు ఏబీ పాండ్యా కమిటీ పలు లోపాలు ఎత్తిచూపుతూ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి 8న నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ వివేక్ త్రిపాఠి బృందం, కేంద్ర జలసంఘం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, సెంట్రల్ సాయిల్-మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులతోపాటు ఏపీ, తెలంగాణ ఇంజనీర్ల కమిటీ పరిశీలించింది. ప్లంజ్పూల్, 2009 వరదకు దెబ్బతిన్న డ్యాం డౌన్ స్ట్రీమ్లో ఆప్రాన్కు వెళ్లే అప్రోచ్ రోడ్డు, రిటైనింగ్ వాల్ నిర్మాణం, రివర్స్ స్లూయిస్ గేట్ల నిర్వహణ, లీకేజీలు అరికట్టేందుకు గేట్లకు సీల్స్ ఏర్పాటుపై తక్షణమే దృష్టిసారించాలని సూచించింది. డ్రిప్-2 కింద 19పనులకు రూ.203 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపినా నిధులు మాత్రం రాలేదు.