Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

వినూత్నంగా చంద్రబాబు ‘ప్రజా గళం’

ABN , Publish Date - Mar 03 , 2024 | 02:55 AM

వినూత్న తరహాలో ప్రజా గళం పేరుతో ఒక కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సమాయత్తం అవుతున్నారు.

వినూత్నంగా చంద్రబాబు ‘ప్రజా గళం’

అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): వినూత్న తరహాలో ప్రజా గళం పేరుతో ఒక కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సమాయత్తం అవుతున్నారు. ఈ కార్యక్రమం 6 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటిదాకా తన సభలు, సమావేశాలకు వచ్చిన వారిని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించడం అనవాయితీ. ప్రజాగళంలో ఈ నమూనాను మార్చివేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి ఏ విధంగా పరిష్కారం చూపిస్తామో చంద్రబాబు చెబుతారు. అందుకే ఈ కారక్రమానికి ప్రజా గళం అని పేరు పెట్టినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాలకు పార్టీ శ్రేణులతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారిని... సమాజంలో ప్రభావం చూపుతున్న ప్రముఖులను కూడా పిలుస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభావశీలురుగా గుర్తింపు పొందినవారిని కూడా ఆహ్వానిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఆరేడు వేల మందితో మాత్రమే ఈ సమావేశాలు జరుపనున్నారు. రోజుకు రెండు నియోజకవర్గాల్లో ఈ సమావే శాలు పెట్టనున్నారు. 6న నంద్యాల, కడప జిల్లా మైదుకూరులో, 7న వేమూరు, పామర్రు, 8న పలాస, పాడేరు, 9న రామచంద్రాపురం, ప్రత్తిపాడు, 10న మార్కాపురం, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు జరుగుతాయి. కాగా, టీడీపీ యువ నేత లోకేశ్‌ నిర్వహిస్తున్న శంఖారావం సమావేశాలు 3న ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. మంగళగిరి పరిధిలో 5న జయహో బీసీ సభ ఉండటంతో దానికోసం వాయిదా వేశారు. ఈ నెల 7నుంచి ఇవి ప్రారంభం అవుతాయని అంటున్నారు.

Updated Date - Mar 03 , 2024 | 08:38 AM