వివేకా కేసులో.. కడప కోర్టు ఉత్తర్వులపై విచారణకు మరో హైకోర్టు బెంచ్ దూరం
ABN , Publish Date - Apr 30 , 2024 | 03:56 AM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైసీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణ నుంచి మరో హైకోర్టు ధర్మాసనం తప్పుకొంది.
అమరావతి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైసీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణ నుంచి మరో హైకోర్టు ధర్మాసనం తప్పుకొంది. వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్రెడ్డి(బీటెక్ రవి) వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లు (సివిల్ మిసిలేనియస్ అప్లికేషన్) సోమవారం జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జగడం సుమతితో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. విచారణ నుంచి వైదొలుగుతున్నట్లు ఈ ధర్మాసనం ప్రకటించింది. విచారణ నిమిత్తం ఈ వ్యాజ్యాలను ఇంకో బెంచ్ ముందు ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది.