కూటమి గెలవకపోతే నాలుక కోసుకుంటా!
ABN , Publish Date - Jun 03 , 2024 | 03:34 AM
ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తారని, కూటమి ప్రభుత్వం రాకుంటే తాను నాలుక కోసుకుంటానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర ఇన్చార్జి బుద్దా వెంకన్న ప్రకటించారు.
![కూటమి గెలవకపోతే నాలుక కోసుకుంటా!](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
వైసీపీ రాకపోతే ఆరా మస్తాన్ కోసుకుంటారా?: బుద్దా వెంకన్న సవాల్
విజయవాడ(వన్టౌన్), జూన్ 2: ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తారని, కూటమి ప్రభుత్వం రాకుంటే తాను నాలుక కోసుకుంటానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర ఇన్చార్జి బుద్దా వెంకన్న ప్రకటించారు. విజయవాడలోని తన కార్యాలయం లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూటమికి అనుకూలంగా ఇచ్చాయన్నారు. జగన్ క్రిమినల్ ఆలోచనలతో ఫేక్ సర్వేలు చేయించారని ఆరోపించారు. వైసీపీ ఓడిపోతే ఇక జీవితంలో అసెంబ్లీలో అడుగుపెట్టబోనని చెప్పే ధైర్యం జగన్కు ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ కేడర్లో ఇప్పటికే ఓటమి నైరాశ్యం అలముకుంద ని, వారిలో ఉత్సాహాన్ని నింపడానికే వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆరా మస్తాన్తో జగన్ చెప్పించారని, వైసీపీ రాకపోతే ఆరా మస్తాన్ నాలుక కోసుకుంటారా అని సవాల్ విసిరారు. అది ఫేక్ సర్వే అని వైసీపీ నాయకులకు కూడా తెలుసని, బెట్టింగులు కాయడానికి మైండ్గేమ్ ఆడారని విమర్శించారు. వైసీపీ కీలక నేతల అనుచరులు కూడా టీడీపీ గెలుస్తుందని పందెం కాశారన్నారు. కూటమికి 130 సీట్లకు పైగా వస్తాయని చెప్పారు. కూటమి అధికారంలోకి రాగానే ఆరా మస్తాన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. చిత్తశుద్ధి ఉంటే మంగళవారం సాయంత్రానికైనా నిజాలు చెప్పాలన్నారు.