Share News

సాక్షిలో నాకూ సగం వాటా ఉంది

ABN , Publish Date - Jan 30 , 2024 | 04:18 AM

: ఏ సాక్షిలో అయితే నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో ఇదే సాక్షిలో నాకు భాగం ఉందని, ఈ మేరకు అప్పట్లోనే రాజశేఖరరెడ్డి నిర్ణయించారని వైఎస్‌ షర్మిల అన్నారు. ఆడపిల్ల అన్న ఇంగితం కూడా లేకుండా జోకర్ల చేత

సాక్షిలో నాకూ సగం వాటా ఉంది

ఎవరు కాదన్నా.. నేను వైఎస్‌ షర్మిలారెడ్డినే: షర్మిల

కడప, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఏ సాక్షిలో అయితే నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో ఇదే సాక్షిలో నాకు భాగం ఉందని, ఈ మేరకు అప్పట్లోనే రాజశేఖరరెడ్డి నిర్ణయించారని వైఎస్‌ షర్మిల అన్నారు. ఆడపిల్ల అన్న ఇంగితం కూడా లేకుండా జోకర్ల చేత ఇష్టం వచ్చినట్టు తన గురించి మాట్లాడిస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి నిప్పులు చెరిగారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, జగన్‌ను జైల్లో పెట్టించాలని అప్పటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తన భర్త అనిల్‌ కోరారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన వదిన భారతీరెడ్డితో కలిసే సోనియా వద్దకు తన భర్త వెళ్లారని, వారు చెప్పేది నిజమే అయితే భారతీరెడ్డితో ఈ విషయం చెప్పిస్తారా అని సవాల్‌ విసిరారు. సోమవారం కడపలో కాంగ్రెస్‌ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘నా భర్త ఎప్పుడు సోనియా వద్దకు వెళ్లినా... మా వదిన భారతీరెడ్డితో కలిసే వెళ్లారు. మరి... ‘షర్మిలను సీఎం చేయండి’ అని నా భర్త భారతీరెడ్డి ముందే సోనియాకు చెప్పారా? లేక వెనుక చెప్పారా? దీనికి భారతీరెడ్డి సాక్ష్యం చెబుతారా? అసలు ఈ విషయాన్ని ప్రణబ్‌ ముఖర్జీ ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగంగా చెప్పారా? ఇప్పుడు ఆయన లేరు. కనీసం... ఆయన కుమారుడితోనైనా చెప్పిస్తారా? ఇక మీ కుట్రలకు అడ్డూ అదుపూ ఉండదా?’ అని మండిపడ్డారు. ‘నేను రాజశేఖరరెడ్డి బిడ్డను. పులి కడుపున పులి పుడుతుంది. నా ఉనికి ఇదే. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ఎవరు గీపెట్టిన్నా, నేను వైఎస్‌ షర్మిలారెడ్డి. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడకు వచ్చా. మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరు. ఇక్కడున్నది రాజశేఖరరెడ్డి బిడ్డ.. ఖబడ్దార్‌. మళ్లీ చెబుతున్నా.. ఇది నా పుట్టిల్లు’ అని అన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 04:18 AM