Share News

20 లక్షల ఉద్యోగాల కల్పన బాధ్యత నాది

ABN , Publish Date - May 03 , 2024 | 05:16 AM

ఏటా సింగిల్‌ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం. నిరుద్యోగులు పేపర్లు తీసుకుని వెతుక్కోవాల్సిన అవసరం లేదు.

20 లక్షల ఉద్యోగాల కల్పన బాధ్యత నాది

యూనిఫైడ్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తాం

యువతకు నారా లోకేశ్‌ భరోసా

చంద్రగిరి, మే 2(ఆంధ్రజ్యోతి): ‘ఏటా సింగిల్‌ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం. నిరుద్యోగులు పేపర్లు తీసుకుని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్‌లో ప్యూన్‌ నుంచి గ్రూప్‌1, 2 వరకు పోస్టులు వరకూ అన్నీ ప్రకటిస్తాం. యూనిఫైడ్‌ పోర్టల్‌ తీసుకొస్తాం. వెబ్‌సైట్‌లో మీ వివరాలు నమోదు చేస్తే ఏ పరీక్షకైనా హాజరయ్యేలా వెసులుబాటుకల్పిస్తాం’ అని టీడీపీ జాతీయ ప్రఽధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువతకు భరోసా ఇచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలోని ఐతేపల్లి వద్ద గురువారం ఆయన ‘హలో లోకేశ్‌’ కార్యక్రమం ద్వారా స్థానిక యువతతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ‘సూపర్‌ సిక్స్‌’లో మొదటి హామీగా ఉన్న 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వం ఏర్పాటైన ఐదేళ్లలో కల్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులతో 30 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు గత టీడీపీ ప్రభుత్వంలో వివిధ కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు లోకేశ్‌ తెలిపారు. తిరుపతికి టీసీఎల్‌, డిక్సన్‌, సెల్‌కాన్‌ తదితర పరిశ్రమలు టీడీపీ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో రెండు డీఎస్సీల ద్వారా 32 వేల పోస్టులు భర్తీ చేశామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 2.35 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన జగన్‌ ఒక్క జాబ్‌ క్యాలెండర్‌ కూడా ప్రకటించలేదన్నారు. జగన్‌ తన ఇద్దరు బిడ్డల నూ విదేశాల్లోనే చదివిస్తున్నారని, కానీ మన బిడ్డలు మాత్రం విదేశాల్లో చదువుకోకూడదా అని ప్రశ్నించారు.


‘‘జగన్మోహన్‌రెడ్డి పదేపదే చంద్రబాబును ముసలోడని అంటున్నారు. ఈ రోజుతో అది తేలిపోవాలి. కొబ్బరికాయ ఇస్తే కనీసం వంగి కొట్టలేని, బస్సు నుంచి స్టూలు లేనిదే కిందకు దిగలేని.. ముసలోడు ఈ సైకో జగన్‌. ఆయనకు ఓ సవాల్‌ విసురుతున్నా. మై డియర్‌ జగన్‌.. టైం, డేట్‌ నువ్వు ఫిక్స్‌ చేయ్‌. నేను చంద్రబాబును తీసుకొస్తా. ఇక్కడే తిరుమల ఉంది. నువ్వు ముందు మెట్లు ఎక్కుతావో, చంద్రబాబు ముందు ఎక్కుతారో చూద్దాం. అప్పుడు ముసలోడు ఎవరో ప్రజ లే నిర్ణయిస్తారు’’ అని అన్నారు. ‘గతంలో కోడికత్తిలా తాజాగా గులకరాయి డ్రామా ఆడారు. అదో ఇంపోర్టెడ్‌ రాయి. కోడికత్తి డ్రామా జరిగిన 15 రోజుల తర్వాత బాబాయ్‌ శవమయ్యారు. ఇప్పుడు మళ్లీ తాడేపల్లి నుంచి ఏ శవం బయటికి వస్తుందోనని కుటుంబసభ్యులు భయంగా ఉన్నారు. సొంత తల్లి, చెల్లే జగన్‌ను చూసి భయపడుతున్నారు. రాష్ట్రంలో ఇక మహిళల పరిస్థితి ఏంటి’ అని లోకేశ్‌ ప్రశ్నించారు.

Updated Date - May 03 , 2024 | 05:16 AM