వైసీపీలో వారసుల హల్చల్!
ABN , Publish Date - Apr 22 , 2024 | 03:11 AM
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున ఈ సారి కొంద రు కీలక నేతల వారసులు బరిలోకి దిగుతున్నారు. వార సులకు టికెట్లు ఇవ్వనని గతంలో గంభీరంగా ప్రకటించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి..
![వైసీపీలో వారసుల హల్చల్!](https://media.andhrajyothy.com/media/2024/20240413/gj_928718390a.jpg)
చెవిరెడ్డి, భూమన, పేర్ని, బలరాం కొడుకులకు టికెట్లు
ముత్యాలనాయుడు, నారాయణస్వామి, ముస్తఫా కుమార్తెలకూ
బొత్స కుటుంబంలో ఏకంగా నలుగురికి చాన్సు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున ఈ సారి కొంద రు కీలక నేతల వారసులు బరిలోకి దిగుతున్నారు. వార సులకు టికెట్లు ఇవ్వనని గతంలో గంభీరంగా ప్రకటించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇప్పుడు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల కుమారులు, కుమార్తెలకు, కోడళ్లకు సీట్లు కట్టబెట్టడం గమనార్హం. ఒకే కుటుంబంలో ఇద్దరి నుంచి నలుగురి వరకు టికెట్లు దక్కాయి. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కొడుకు మోహిత్రెడ్డి, తిరుపతిలో భూమన కరుణాకర్రెడ్డి కొడుకు అభినయ్రెడ్డి, మచిలీపట్నంలో పేర్ని నాని కొడుకు కృష్ణమూర్తి, చీరాలలో కరణం బలరాం కొడుకు వెంకటేశ్.. మాడుగులలో ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కుమార్తె అనూరాధ, గంగాధర నెల్లూరు (ఎస్సీ)లో మరో డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి, గుంటూరు తూర్పులో షేక్ ముస్తఫా కుమార్తె షేక్ నూర్ ఫాతిమాకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చారు. అరకులోయ (ఎస్టీ) ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కోడలు తనూజారాణిని అరకు (ఎస్టీ) లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్యను మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దింపారు.
చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఒంగోలు లోక్సభకు, ముత్యాల నాయుడు అనకాపల్లి లోక్సభకు వైసీపీ అభ్యర్థు లుగా పోటీచేస్తుండడం గమనార్హం. మరోవైపు.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు నుంచి అసెంబ్లీకి పోటీచేస్తుండగా.. ఆయన కుమారుడు సునీల్ కుమార్ ఏలూరు లోక్సభ స్థానానికి పోటీచేస్తున్నారు.
వీరి ఇళ్లలో రెండేసి టికెట్లు అన్న మాట.
మంత్రి ఆదిమూలపు సురేశ్
ప్రకా శం జిల్లా కొండపి (ఎస్సీ) నుంచి పోటీచేస్తుండగా.. ఆయన సోదరుడు ఆదిమూలపు సతీశ్ కర్నూలు జిల్లా కోడుమూరు (ఎస్సీ) స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి మంత్రి అంబటి రాంబాబు మళ్లీ పోటీ చేస్తుండగా.. ఆయన సోదరుడు అంబటి మురళి గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి బరిలోకి దిగుతున్నారు.
కడప జిల్లా పులివెందుల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోటీ చేస్తుంటే.. ఆయన మేనమామ పి.రవీంద్రనాథరెడ్డి కమలాపురం నుంచి.. సీఎం సోదరుడు
వైఎస్ అవినాశ్రెడ్డి కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.
శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు,
అదే జిల్లా నరసన్నపేట నుంచి ఆయన సోదరుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పోటీ చేస్తున్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి జాక్పాట్ తగిలింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన, గజపతినగరంలో ఆయన సోదరుడు బొత్స అప్పలనర్సయ్య, నెల్లిమర్లలో ఆయన సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు పోటీ చేస్తుండగా.. విశాఖ లోక్సభ స్థానం నుంచి బొత్స భార్య ఝాన్సీలక్ష్మి బరిలోకి దిగుతున్నారు.