వై నాట్ 175 వెనుక భారీ కుట్ర
ABN , Publish Date - Feb 13 , 2024 | 02:19 AM
విద్వేషం... విధ్వంసం... అరాచకం... నియంతృత్వం మినహా వైసీపీ పాలనలో ఇంకేమీ లేవని, రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు.
![వై నాట్ 175 వెనుక భారీ కుట్ర](https://media.andhrajyothy.com/media/2023/20231205/ghb_ab0eb7aada.jpg)
అభ్యర్థులతో పాటు ఓటర్ల నియోజకవర్గాల్లోనూ మార్పులు ఆశ్చర్యకరం: పురందేశ్వరి
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): విద్వేషం... విధ్వంసం... అరాచకం... నియంతృత్వం మినహా వైసీపీ పాలనలో ఇంకేమీ లేవని, రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. కేసులు, అరెస్టులు, అణచివేతలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న అధికార పార్టీకి ఎన్నికల ముందు అసలు భయం మొదలైందన్నారు. విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ‘ప్రజా పోరు’ కార్యక్రమం కోసం జరిగిన సమావేశానికి హాజరైన ఆమె మాట్లాడుతూ... ‘ఓటర్ల జాబితాలో అక్రమాలు కేవలం తిరుపతికి మాత్రమే పరిమితం అయ్యాయని అనుకుంటే పొరపాటు. తిరుపతి నుంచి విశాఖపట్నం వరకూ మా పార్టీ ఆధారాలతో సహా ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకూ ఐఏఎస్, పోలీసు అధికారులపై చర్య తీసుకుంది. మరింత లోతుగా విచారణ జరిపించి సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి జగన్ పదే పదే ‘వై నాట్ 175’ అనడం వెనుక భారీ కుట్ర ఉంది. అభ్యర్థులను నియోజకవర్గాలు మార్చుతున్న వైసీపీ అక్కడి ఓటర్లను సైతం వేల సంఖ్యలో మార్చడం ఆశ్చర్యకరం. గుంటూరులో పోటీ చేయబోతున్న మంత్రి విడుదల రజినీ పాత నియోజకవర్గం చిలకలూరిపేటలో అనుచరులు, ఓటర్లు పది వేల మందికి పైగా ఇక్కడ కొత్తగా ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు’ అని ఆరోపించారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి బీజేపీలో చేరిన పారిశ్రామిక వేత్తలకు కండువా కప్పి పురందేశ్వరి ఆహ్వానించారు.