Share News

నొక్కింది ఎంత.. బొక్కింది ఎంత!

ABN , Publish Date - Mar 28 , 2024 | 04:24 AM

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చడానికి ఇంకా ఏడు వారాల గడువే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

నొక్కింది ఎంత.. బొక్కింది ఎంత!

జనం రక్తాన్ని పీల్చే ‘జలగ’ సర్కార్‌

నరకాసుర పాలనకు అంతం పలకండి

ఆలోచించి, ఆత్మసాక్షితో ఓటు వేయండి

రాష్ట్రాన్ని ఇప్పుడే కాపాడుకోవాలి

లేదంటే తర్వాత మన చేతుల్లో ఉండదు

‘గొడ్డలి’ కేసులో నిందితుడికి ఎంపీ టికెట్టా?

సీఎం జగన్‌ రాయలసీమ ద్రోహి

సాగునీటి రంగాన్ని నాశనం చేశాడు

ప్రజాగళం సభలో చంద్రబాబు ధ్వజం

రూ.10 ఇచ్చి వంద దోచేసిన జగన్‌

టీడీపీ సర్కారు వచ్చాక ప్రతి ఎకరాకూ నీళ్లిస్తాం

రతనాల సీమగా మారుస్తాం

గోదావరి జలాలనూ తెచ్చి వెలుగులు నింపుతాం

టీడీపీ అధినేత స్పష్టీకరణ

పలమనేరు, మదనపల్లె, పుత్తూరుల్లో ప్రజాగళం సభలు

పలమనేరు/పుత్తూరు/రాయచోటి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చడానికి ఇంకా ఏడు వారాల గడువే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని ఇప్పుడే కాపాడుకోవాలని.. లేకపోతే ఇక అది మన చేతుల్లో ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే జగన్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు. ‘సమయం లేదు మిత్రమా.. ఏడు వారాలే గడువుంది.. నా బాధ్యత నేను చేస్తా... మీ బాధ్యత నిర్వర్తించడానికి మీరు సిద్ధమా’ అని ప్రజలను ప్రశ్నించారు. బుధవారం ప్రజాగళం యాత్రను ప్రారంభించిన ఆయన తొలిరోజు చిత్తూరు జిల్లా పలమనేరు, తిరుపతి జిల్లా పుత్తూరు, అన్నమయ్య జిల్లా మదనపల్లెల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. మొన్నటి దాకా పరదాల చాటున పర్యటనలు సాగించిన ముసుగువీరుడు జగన్‌.. ఇప్పుడు మొదటిసారిగా తాడేపల్లి ప్యాలెస్‌ దాటి జనాల్లోకి వచ్చాడని ఎద్దేవా చేశారు. ప్రచారానికి వస్తున్న ఆయనకు ఖాళీ రోడ్లతో, ఖాళీ ఇళ్లతో స్వాగతం పలకాలని పిలుపిచ్చారు. ‘జగన్‌కు స్వాగతం పలికినా, మద్దతు తెలిపినా మీకు మీరు అన్యాయం చేసుకున్నట్లే. ఓటు కు రూ.5 వేల నుంచి రూ.10 వేలు పంచేందుకు జగన్‌ సిద్ధమయ్యాడు. ఆ అవినీతి డబ్బు మాకొద్దంటూ ఛీ కొట్టండి’ అని కోరారు. ఇడుపులపాయలో తండ్రి వైఎస్‌ సమాధి వద్ద పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించాడని, అయితే ఆ తండ్రికి లక్ష్మణుడిలా వెన్నంటి ఉన్న తమ్ముడు వివేకానందరెడ్డిని గొడ్డలి వేటుతో హ తమార్చిన కేసులో నిందితుడైన అవినాశ్‌రెడ్డికి ఎంపీ సీటు కేటాయించాడని విమర్శించారు. ఎవరిమీదైనా ఆరోపణలు వస్తే విచారణలో అవి తొలగిపోయాక టికె ట్‌ ఇవ్వాలని, అయితే జగన్‌ సొంత బాబాయి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి లోక్‌సభ టికెట్‌ కేటాయించడాన్ని ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. బాబాయిని చంపినవారెవరో చెప్పి ఓట్లు అడగాలని జగన్‌ ను డిమాండ్‌ చేశారు. మీ బాబాయిల గతి కూడా ఏమవుతుందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.

జగన్‌ బొక్కింది ఎంత?

జగన్‌ వట్టి బటన్లే నొక్కుతున్నాడు. బటన్‌ నొక్కింది ఎంత.. ఆయన బొక్కింది ఎంతో చెప్పాలి. ఒకప్పటి రూ.200 కరెంటు బిల్లు ఇప్పుడు రూ.800 అయింది. ప్రజల రక్తాన్ని తాగే జలగ కావాలా.. మంచి ప్రభుత్వం కావాలా అనేది ప్రజలే ఆలోచించుకోవాలి. రాష్ట్రం దశ దిశా మార్చేందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలి. ఇది ఎంతో కీలక సమయం. ఐదేళ్ల నరకాసుర పాలనకు చెక్‌పెట్టే సమయం. ప్రజాస్వామ్యంలో ప్రజ లే న్యాయనిర్ణేతలు. అందుకే మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా ను. జగన్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు కేవలం 47 రోజులే మిగిలి ఉన్నాయి. మే 13న ఓటింగ్‌కు వెళ్లినప్పుడు మనస్సాక్షితో ఆలోచించి మా కూటమికి మద్దతుగా ఓటు వేయాలి. మంత్రి పాపాల పెద్దిరెడ్డి ఇసుక, మైనింగ్‌, గ్రానైట్‌ తింటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు. కడప జిల్లా ఒంటిమిట్టలో పాల సుబ్బారావు అనే చేనే త కార్మికుడి భూమిని వైసీపీ నాయకులు రికార్డులు మార్చి కబ్జా చేశారు. దాంతో దిక్కుతోచక, బతుకు మీద ఆశ నశించి చేనేత కార్మికుడి కుటుంబం ఆత్మహ త్య చేసుకుంది. ఇలాంటి అరాచక సంఘటనలు గత ఐదేళ్లలో ఎన్నో జరిగాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్లు వైసీపీ విముక్త ఏపీగా మారుద్దాం.

ఆంక్షలు లేకుండా సంక్షేమం

అధికారంలోకి రాగానే ఎలాంటి ఆంక్షలు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నా ప్రతి ఒక్కరికీ నెలకు రూ.1,500 చొప్పున అందిస్తాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాలో వేస్తాం. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. వృద్ధులకు, వితంతువులకు నెలకు రూ.4 వేల చొప్పున మొదటి తేదీనే నేరుగా ఇంటికే పంపిస్తా. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తాం. నిరుద్యోగ యువత కోసం మెగా డీఎస్సీ పెట్టి 60 రోజుల్లో పూర్తి చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తాం. ఆడబిడ్డలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. చేనేత, మరమగ్గాల కార్మికుల కోసం 500 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్‌ అందిస్తాం. అన్న క్యాంటీన్లు తిరిగి ఏర్పాటు చేస్తాం. నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో కి తెస్తాం. జే బ్రాండ్స్‌ మద్యం లేకుండా చేస్తాం. వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మారుస్తాం. ఉద్యోగులకు అండగా ఉంటాం. వేధింపులు లేకుండా చూస్తాం. జీతాలు, పెన్షన్లు 1నే అందిస్తాం. రాబోయే 47 రోజులు ప్రభుత్వ ఉద్యోగులు చట్టప్రకారం పనిచేయాలి. గత ఐదేళ్లుగా జగన్‌ వారిని బానిసలుగా చూశాడు. జీతాలు అడిగితే కేసులు పెట్టారు. దాచుకు న్న పీఎఫ్‌ డబ్బులు కూడా తీసుకోలేని స్థితిలో ఉద్యోగులు ఉండిపోయారు. వారికి న్యాయం చేస్తా.

రాళ్లసీమగా..

సీమలో సాగునీటి ప్రాజెక్టులన్నీ భ్రష్టు పట్టాయి. రాజులు ఏలిన రతనాల సీమ రాళ్ల సీమగా మారిపోయింది. గత టీడీపీ హయాంలో రూ.68 వేల కోట్లను ఖర్చు చేసి ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పరిగెత్తిచ్చాం. నీళ్లు వస్తే అభివృద్ధి జరుగుతుంది. ఐదేళ్లలో 62 ప్రాజెక్టులు చేపట్టి 24 ప్రాజెక్టులను పూర్తి చేశాం. 32 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరించి 7 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్లు ఇచ్చాం. సీమలోని సాగునీటి ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాం. ఒక్క హంద్రీ-నీవాపైనే రూ.4,200 కోట్లను ఖర్చు చేశాం. మేం 90 శాతం పనులు పూర్తి చేస్తే, ఈ దుర్మార్గులు 10 శాతం పూర్తి చేయలేక కరువును తీసుకొచ్చారు. టీడీపీ వచ్చాక ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి రతనాల సీమగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నా. గోదావరి జలాలు కూడా సీమకు తెచ్చి వెలుగులు నింపుతాం. ఐదేళ్లలో సీమ సాగునీటి ప్రాజెక్టులపై జగన్‌ రూ.2,125 కోట్లే ఖర్చు చేశాడు. వసూళ్ల కోసం నియమించుకున్న సలహాదారులకు ఇచ్చిన జీతాలంత కూడా సీమ ప్రాజెక్టులకు ఖర్చు చేయలేదు. అలాగే గత ఐదేళ్లలో తన రోత పత్రికకు ప్రకటనల కోసం ఖర్చు చేసినంత మొత్తం కూడా ప్రాజెక్టులకు కేటాయించలేదు. మొన్నటి వరకు సిద్ధం అన్నాడు.. ఇప్పుడు మేమంతా సిద్ధం అంటూ వస్తున్నాడు. ఆయన్ను ఇంటికి పంపడానికి జనాలంతా సిద్ధంగా ఉన్నారు.

యువత రోడ్లపైకి రావాలి..

గడచిన ఐదేళ్లలో జాబ్‌ కేలెండర్‌ వచ్చిందా? మెగా డీఎస్సీ పెట్టారా? యువతకు భవిష్యత్‌పై ఆశ ఉందా? పరిశ్రమలు కొత్తవి రావడం లేదు. ఉన్నవి కూడా రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నాయి. ఇప్పటికైనా యువత మేల్కోవాలి. భవిష్యత్‌ కావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా టీడీపీ కూటమికి ఓటేయాలి. తాను పేదల మనిషినని చెబుతున్న జగన్‌ పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లు రద్దు చేశాడు. పేద విద్యార్థులకు విదేశీ విద్య అందించే పథకాన్ని, కార్పొరేట్‌ విద్య అందించే పథకాన్ని రద్దుచేసి పెత్తందారునని నిరూపించుకున్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా సక్రమంగా చెల్లించడం లేదు. కార్పొరేషన్లకు నిధులు ఆపేశారు. పథకాలన్నీ రద్దు చేశారు. గత ఐదేళ్లలో తొమ్మిది సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారు.

జగన్‌ అహంకారం మే 13న కరిగిపోతుంది!

అందరు సీఎంల ఆస్తితో పోలిస్తే జగన్‌కే ఎక్కువ ఆస్తులున్నాయి. అన్ని రంగాలను నాశనం చేశాడు. మే 13న (పోలింగ్‌ రోజు) ఆయన అహంకారం కరిగిపోతుంది. టీడీపీ ప్రజాగళం తుఫానుకు వైసీపీ చిత్తుగా ఓడిపోతుంది. తాడేపల్లి ప్యాలెస్‌ బద్దలు కొట్టే రోజు వస్తోంది. ఒక్క చాన్స్‌ అంటూ నమ్మించి అధికారంలోకి వచ్చి జగన్‌ ఐదేళ్లుగా అన్ని వర్గాలనూ హింసిస్తూ మాయమాటలతో నమ్మించి తడి గుడ్డతో గొంతు కోశాడు. నా రాజకీయ జీవితంలో ఎందరో సీఎంలను చూశాను. ఇటువంటి పనికిమాలిన ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదు. ఈ సీఎం రూ.10 ఇచ్చి రూ.వంద దోచేసే రకం. టీడీపీ రూ.15 ఇచ్చి దాన్ని రూ.వెయ్యిగా పెంచేరకం. టీడీపీకి సంపద సృష్టించడమే తెలుసు.

ముస్లింలకు అన్యాయం జరగదు

జగన్‌ రూ.12 లక్షల కోట్ల అప్పులు చేశాడు. ఇక అప్పులు ముట్టే పరిస్థితి కూడా లేదు. ఆదాయం తగ్గిపోయింది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం అవసరం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, బీజేపీ, జనసేన పొ త్తు పెట్టుకున్నాయి. ఐదేళ్లుగా కేంద్రంలో అన్ని బిల్లులకు మద్దతు తెలిపిన జగన్‌.. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం మేం ముగ్గురం కలిస్తే నన్ను విమర్శిస్తున్నాడు. ముస్లింలకు ఇచ్చిన హామీలను ఆయన అమలు చేయలేదు. ఎన్టీయేలో ఉన్నప్పుడు గతంలో కూడా ఏ ముస్లిం కూ అన్యాయం జరుగలేదు. ఇక ముందూ జరగదు.

ఇంటికి కిలో బంగారమిచ్చినా జగన్‌కు ఓటమి తప్పదు: లోకేశ్‌

అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ ఐదేళ్ల అరాచక పాలనతో జనం విసిగిపోయారు. ఆయనను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలె్‌సలో బంధించాలని నిర్ణయానికి వచ్చారు’ అని లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తా యిలాలతో ఓటర్లను ఏ మార్చే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ‘టీడీపీ ఫిర్యాదు చేస్తే వైసీపీ తాయిలాల డంప్‌నైతే పట్టుకున్నారు. మరి ఇసుక, లిక్కర్‌లో జగన్‌ దోచుకుని, ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బుల డంప్‌ను ఎప్పుడు పట్టుకుంటారు? ఇప్పుడున్న పరిస్థితు ల్లో ఇంటికి కేజీ బంగారం ఇచ్చినా జగన్‌పై నెలకున్న ఆగ్రహ జ్వాలను ఆపడం సాధ్యం కాదు’ అన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 04:24 AM