Share News

చరిత్రకెక్కిన నంద్యాల!

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:48 AM

నంద్యాల లోక్‌సభ స్థానానికి రాజకీయ చరిత్రలో అరుదైన గుర్తింపు ఉంది. ఇద్దరు రాజకీయ ఉద్ధండులు..

చరిత్రకెక్కిన నంద్యాల!

రాష్ట్రపతిగా నీలం.. ప్రధానిగా పీవీ

ఇక్కడి నుంచే లోక్‌సభకు వారి ఎన్నిక

నంద్యాల లోక్‌సభ స్థానానికి రాజకీయ చరిత్రలో అరుదైన గుర్తింపు ఉంది. ఇద్దరు రాజకీయ ఉద్ధండులు.. నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు ఇక్కడి నుంచే ఎన్నికై రెండు అత్యున్నత స్థాయి రాజ్యాంగ పదవులను చేపట్టారు. సంజీవరెడ్డి 1977 ఎన్నికల్లో నంద్యాల నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పెండేకంటి వెంకటసుబ్బయ్యపై దాదాపు 36 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇందిరాగాంధీ ప్రభంజనాన్ని తట్టుకుని.. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏకైక కాంగ్రెస్‌ యేతర ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో మిగతా 41 ఎంపీ స్థానాలను కాంగ్రెస్‌ (ఐ) చేజిక్కించుకోవడం గమనార్హం. అనంతరం ఆయన లోక్‌సభ స్పీకర్‌ అయ్యారు. తదనంతర పరిణామాల్లో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా ఆయన్ను రాష్ట్రపతిగా ఎన్నుకున్నాయి. ఇక పీవీ కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడ పోటీచేశారు. 1991 లోక్‌సభ ఎన్నికల సమయంలో తమిళనాట శ్రీపెరంబదూర్‌ ఎన్నికల సభలో పాల్గొన్న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని మానవబాంబు దాడితో ఎల్‌టీటీఈ పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌ పీవీని తొలుత ఏఐసీసీ అధ్యక్షుడిగా.. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధానిగా ఎన్నుకుంది. నాటికి ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు. 6 నెలల్లో ఎంపీగా ఎన్నిక కావలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి నంద్యాల నుంచి పోటీ చేయాలని పీవీని కోరారు. ఇందుకు మార్గం సుగమం చేస్తూ సిటింగ్‌ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో నంద్యాల నుంచి పోటీ చేసిన పీవీ నరసింహారావు 5.80 లక్షల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్‌పై గెలిచారు. తెలుగు తేజం పీవీపై గౌరవంతో ఎన్టీఆర్‌ టీడీపీ తరఫున అభ్యర్థిని దించలేదు. పీవీ తిరిగి 1996లో రెండోసారి కూడా ఇక్కడి నుంచే పోటీచేసి టీడీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డిపై విజయం సాధించారు. అయితే నాడు ఒడిశాలోని బరంపురం నుంచి కూడా ఆయన గెలిచారు. నంద్యాల స్థానానికి రాజీనామా చేశారు.

-నంద్యాల టౌన్‌

Updated Date - Apr 25 , 2024 | 05:48 AM