హాజరు ప్రకారమే జీతభత్యాలు
ABN , Publish Date - Oct 27 , 2024 | 04:11 AM
హాజరుకు సంబంధించి రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా నడుచుకుంటేనే ఆర్టీఐ కమిషనర్ చావలి సునీల్కు సెప్టెంబరు నెల జీతభత్యాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
ఆర్టీఐ కమిషనర్ సునీల్ వ్యాజ్యంపై హైకోర్టు ఉత్తర్వులు
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): హాజరుకు సంబంధించి రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా నడుచుకుంటేనే ఆర్టీఐ కమిషనర్ చావలి సునీల్కు సెప్టెంబరు నెల జీతభత్యాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ సమాచార కమిషన్ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. సుజాత శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తనకు సెప్టెంబరు నెల జీతభత్యాలు చెల్లించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ చావలి సునీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శనివారం విచారణకు రాగా సునీల్ తరఫు న్యాయవాది వై. నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ఏపీ సమాచార కమిషన్, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ తరఫున న్యాయవాది రవికాంత్ వాదనలు వినిపిస్తూ.. జీతభత్యాల చెల్లింపు నిలిపివేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. సమాచార కమిషన్ పరిధిలోని ఉద్యోగులు, సిబ్బంది అందరికీ బయోమెట్రిక్, మాన్యువల్ హాజరును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. ఈ హాజరు ఆధారంగానే జీతాల చెల్లింపు ఉంటుందని స్పష్టం చేసినట్టు చెప్పారు.