‘రెడ్బుక్’పై విచారణ 13కి వాయిదా
ABN , Publish Date - Feb 07 , 2024 | 04:56 AM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ ముగింపు సభలో ‘రెడ్బుక్’ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
![‘రెడ్బుక్’పై విచారణ 13కి వాయిదా](https://media.andhrajyothy.com/media/2023/20231205/hh_e23d535651.jpg)
చంద్రకాంత్ షా వాంగ్మూలం 15న
విజయవాడ, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ ముగింపు సభలో ‘రెడ్బుక్’ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. అదేవిధంగా, స్కిల్ డెవల్పమెంట్ కేసులో నిందితుడిగా ఉంటూ అప్రూవర్గా మారిన చంద్రకాంత్ షా వాంగ్మూలం నమోదును ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు.
అచ్చెన్నాయుడి చార్జిషీట్పై నేడు విచారణ
ఈఎ్సఐ కుంభకోణం కేసుకు సంబంధించి టీడీపీ ఏపీ చీఫ్, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని బాధ్యుణ్ణి చేస్తూ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జిషీటుపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. చార్జిషీటు దాఖలు చేసే సమయంలో గవర్నర్ అనుమతి తీసుకోవాలని ఇటీవల ఏసీబీ కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ అనుమతి అవసరం లేదని ఏసీబీ తరఫు న్యా యవాదులు వాదిస్తున్నారు. దీనిపై బుధవారం విచారణ జరగనుంది.