రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశాడు!
ABN , Publish Date - Jan 11 , 2024 | 03:12 AM
గుంటూరు జిల్లా పొన్నూరు మండ లం దొప్పలపూడి గ్రామానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించారు.
![రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశాడు!](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
దొప్పలపూడిలో వైసీపీ నాయకుడి బరితెగింపు
పొన్నూరు టౌన్, జనవరి 10: గుంటూరు జిల్లా పొన్నూరు మండ లం దొప్పలపూడి గ్రామానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించారు. గ్రామంలో శివాలయానికి వెళ్లే వీధిలో ఓ వ్యక్తి ఇటీవల గోదాము నిర్మాణం చేపట్టారు. అయితే గోదాము భవనానికి సంబంధించిన మెట్లు పంచాయతీ రోడ్డులోకి వచ్చాయని సదరు వైసీపీ నాయకుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. తన సొంత స్థలంలోనే మెట్లు నిర్మించుకున్నానని, నిబంధనలు అతిక్రమించలేదని ఆ వ్యక్తి పంచాయితీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయినా కూడా మెట్ల నిర్మాణం తొలగించాల్సిందేనని ఆ నాయకుడు పట్టుబట్టారు. పంచాయతీ అధికారులు చెప్పినా వినిపించుకోకుండా శివాలయం నుంచి రామాలయం వెళ్లే వీధిలో రోడ్డుకు అడ్డంగా సిమెంటు గోడ నిర్మించారు. పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి కానీ ఇలాంటి చర్యలకు దిగడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రహదారిపై అడ్డంగా గోడ నిర్మించడం పట్ల గ్రామంలో నిరసన వ్యక్తమవుతోంది.