Share News

వెంటాడే ట్యాపింగ్‌ పాపం!

ABN , Publish Date - Apr 03 , 2024 | 04:11 AM

‘అధికారంలో ఉన్నాం! విపక్ష నేతల ఫోన్లను దొంగచాటుగా విందాం! వ్యూహాలను పసిగట్టి ఎన్నికల్లో గెలిచేద్దాం’... అని చెలరేగిపోయే అధికార పార్టీలకు ఇదో హెచ్చరిక! ట్యాపింగ్‌ పాపం ఊరికే వదలదు.

వెంటాడే ట్యాపింగ్‌ పాపం!

ఎన్నికల్లో గెలుపునకు వాడుకుంటే నేరమే

విపక్షాల సమానావకాశాలు దెబ్బతీయడమే

అధికార దుర్వినియోగంతో గెలిచే కుట్రలు చెల్లవు

గతంలో ఇలాంటి ఆరోపణలతోనే ఇందిరపై

అనర్హత వేటు వేసిన అలహాబాద్‌ హైకోర్టు

తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్‌ ట్యాపింగ్‌

బీఆర్‌ఎస్‌ గెలిచినచోట ప్రత్యర్థులు కోర్టును

ఆశ్రయిస్తే అదే తరహా తీర్పులు వచ్చే చాన్స్‌!

‘అధికారంలో ఉన్నాం! విపక్ష నేతల ఫోన్లను దొంగచాటుగా విందాం! వ్యూహాలను పసిగట్టి ఎన్నికల్లో గెలిచేద్దాం’... అని చెలరేగిపోయే అధికార పార్టీలకు ఇదో హెచ్చరిక! ట్యాపింగ్‌ పాపం ఊరికే వదలదు. ట్యాపింగ్‌ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా విపక్ష నేతల కదలికలపై నిఘా పెట్టడం, ఆర్థికమూలాలపై దాడి చేయడం (ఇల్లీగల్‌ ప్రాక్టీసెస్‌).. అధికార యంత్రాంగాన్ని అడ్డగోలుగా వాడుకోవడం, సొంత పార్టీ నేతల నగదు రవాణాకు టాస్క్‌ఫోర్స్‌ వాహనాలను వాడడం (కరప్ట్‌ ప్రాక్టీసెస్‌).. ఇవన్నీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు సమానావకాశాలు లేకుండా చేయడం కిందకే వస్తాయి. కేవలం ఈ అభియోగాల కారణంగానే అప్పట్లో ఇందిరాగాంధీపై అనర్హత వేటు పడింది. ఈ పరిణామం చివరికి ‘ఎమర్జెన్సీ’ చీకటి రోజులకు కారణమైంది! తెలంగాణలో తాజా పరిణామాలతో ఇప్పుడు ‘ఇందిర కేసు’ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇది వైసీపీకీ ఒక హెచ్చరికలాంటిదే! ఎందుకంటే.. గెలుపు కోసం వైసీపీ అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ట్యాపింగ్‌కూ పాల్పడుతోంది.

ఎన్నికల్లో అక్రమాలు అంటే.. కేవలం ఓటర్లకు డబ్బులు పంచడం, ప్రలోభాలకు గురిచేయడం, రిగ్గింగ్‌ వంటివే కాదు! అధికార దుర్వినియోగమూ దానికిందికే వస్తుంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. అధికారులను ప్రభావితం చేసి ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేయడం, మళ్లీ గెలిచేందుకు అధికారయంత్రాంగాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం.. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమే. విపక్ష నేతలు, ఎన్నికల్లో ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్‌ చేసి.. వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం.. అస్మదీయుల నగదు రవాణాకు టాస్క్‌ఫోర్స్‌ వాహనాలను, పోలీసులను వాడుకోవడం.. ఇవన్నీ ప్రజాప్రాతినిధ్య చట్టంలో పేర్కొన్న ‘కరప్ట్‌ ప్రాక్టీసెస్‌’ కిందికే వస్తాయని రాజకీయ, రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా తెలంగాణలో ఇవన్నీ జరిగినట్లు తాజాగా స్పష్టమైంది. ట్యాపింగ్‌పై లోతైన విచారణ జరుగుతుండటంతో ఒక్కో గుట్టు రట్టవుతోంది. ఇంత చేసినా బీఆర్‌ఎస్‌ నెగ్గిన సీట్లు 36 మాత్రమే. అక్కడ కూడా తమకు సమానావకాశాలు లేకుండా చేసి, చట్టవిరుద్ధమైన చర్యల ద్వారా బీఆర్‌ఎస్‌ గెలిచిందని... ఓటమి పాలైన వారు కోర్టుకు వెళ్లొచ్చు. అదే జరిగితే... బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

ఇందిర విషయంలో జరిగిందిదే...

1971లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 352 సీట్లతో అజేయశక్తిగా నిలిచింది. రాయ్‌బరేలీ నుంచి ఇందిరాగాంధీ లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఆ సీటులో సంయుక్త సోషలిస్ట్‌ పార్టీ అభ్యర్థిగా ఆమెతో పోటీ పడ్డ రాజ్‌నారాయణ్‌.. తన గెలుపుపై చాలా విశ్వాసంతో ఉన్నారు. కానీ, ఫలితం అందుకు విరుద్ధంగా రావడం ఆయనకు షాక్‌. ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దారుణంగా దుర్వినియోగం చేయడమే తన ఓటమికి కారణమని భావించిన ఆయన.. అలహాబాద్‌ హైకోర్టులో ‘ఎన్నికల పిటిషన్‌’ దాఖలుచేశారు. ఎన్నికల పిటిషన్‌ అంటే.. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 80 ప్రకారం.. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి అవినీతి విధానాలను అవలంబించినా, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినా.. ఆ అభ్యర్థిని అనర్హుడిగా/అనర్హురాలిగా ప్రకటించాలంటూ సదరు అభ్యర్థితో పోటీపడిన ప్రత్యర్థిగానీ, ఆ నియోజకవర్గంలోని ఓటరుగానీ హైకోర్టును ఆశ్రయించి వేసే పిటిషన్‌. 1971 ఏప్రిల్‌ 24న రాజ్‌నారాయణ ఈ పిటిషన్‌ వేశారు. ఇందిర ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని.. సాయుధ దళాలు సహా ఎన్నికల ప్రచారంలో ఆమెకు పలువురు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, స్థానిక పోలీసులు సహకరించారని పేర్కొన్నారు. భారత వైమానిక దళం ఆమెకు విమానాలను, హెలికాప్టర్లను సమకూర్చిందని పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 123 (7) ప్రకారం అలా చేయడం ‘కరప్ట్‌ ప్రాక్టీసెస్‌’ కిందకు వస్తుందని.. అది అనర్హతకు తగిన కారణమని గుర్తుచేశారు. అలాగే.. ఆమె తన ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వాహనాలను వాడుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసును విచారించిన అలహాబాద్‌ హైకోర్టు.. ఎన్నికల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినందున ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 123 (7) ప్రకారం ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ 1975 జూన్‌ 12న తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో.. ఉన్న సీటును కోల్పోవడమే కాక, ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా ఆమె కోల్పోయారు. దీనిపై ఇందిర సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ.. దేశ అత్యున్నత న్యాయస్థానం అలహాబాద్‌ హైకోర్టు తీర్పును కొట్టివేయలేదు. ఎగ్జిక్యూషనల్‌ స్టే మాత్రమే ఇచ్చింది. దరిమిలా ఆమె దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రస్తుతం తెలంగాణలో సంచనలం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సైతం అంతకుమించి అధికార దుర్వినియోగం కిందికి వస్తుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.

ఇప్పటికీ చాన్స్‌..

ఫోన్‌ ట్యాపింగేఅక్రమం, చట్టవిరుద్ధం అయితే.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు చట్టబద్ధంగా ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకు తీసుకెళ్తున్న డబ్బు వివరాలను ట్యాపింగ్‌ ద్వారా విని, ఆ సొమ్మును అడ్డుకోవడం ఎన్నికల అక్రమం కిందకే వస్తుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఎన్నికల్లో ప్రత్యర్థుల కాళ్లు,చేతులు కట్టేసినట్టేనని, వారి విజయావకాశాలను దెబ్బతీయడమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. విపక్షాలు న్యాయపరంగా తమకున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ అవసరాల కోసం బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని వస్తుంటే.. ఫోన్‌ట్యాపింగ్‌ ద్వారా తెలుసుకుని పట్టుకున్నారని ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే తన ఫోన్‌ ట్యాప్‌ చేశారని సిరిసిల్ల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన కేకే మహేందర్‌ రెడ్డి సైతం ఇటివలే ఆరోపించారు. అలాగే ఎన్నికల సందర్భంగా తమ ఫోన్‌లు ట్యాప్‌ అయ్యాయని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. అప్పటి అధికార పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం ద్వారా తాము ఓడిపోయామని పేర్కొంటూ వీరంతా హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం. అయితే.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత నిర్ణీత కాలవ్యవధిలోనే హైకోర్టును ఆశ్రయించి ఎలక్షన్‌ పిటిషన్‌ వేయాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. కానీ, ట్యాపింగ్‌ గుట్టు రట్టయిందే ఇప్పుడు కనుక.. ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టును ఇప్పటికైనా ఆశ్రయించవచ్చని, కోర్టు కూడా వారి వాదనను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, కేసును విచారించే అవకాశం ఉన్నదని కొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 04:11 AM