గురుకులాల ప్రవేశ ఫలితాలు విడుదల
ABN , Publish Date - May 15 , 2024 | 03:09 AM
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో (2024-25) సీట్ల భర్తీకి గత నెలలో నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు మంగళగిరిలోని కమిషనర్ కార్యాలయంలో విడుదల చేశారు.
రేపటి నుంచి సీట్ల కేటాయింపు.. ఇంటర్, డిగ్రీ కోర్సులకు కౌన్సెలింగ్
అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో (2024-25) సీట్ల భర్తీకి గత నెలలో నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు మంగళగిరిలోని కమిషనర్ కార్యాలయంలో విడుదల చేశారు. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో విశాఖపట్నం జిల్లాకు చెందిన ఎం.కీర్తి, ఆరో తరగతిలో విజయనగరం జిల్లా విద్యార్థి పి.సోమేశ్వరరావు, ఏడో తరగతిలో శ్రీకాకుళం విద్యార్థి కె.ఖగేంద్ర, ఎనిమిదో తరగతిలో విజయనగరం జిల్లా విద్యార్థి వై.మేఘశ్యామ్ టాపర్లుగా నిలిచారు. 3770 సీట్లు అందుబాటులో ఉండగా 25216 మంది పరీక్షలు రాశారు. గురుకుల జూనియర్ కాలేజీల్లో జె.యశ్వంత్ సాయి (ఎంపీసీ), యం.మహిత(బైపీసీ, ఎల్.సత్యరామ్మోహన్(ఎంఈసీ) టాపర్లుగా నిలిచారు. 7 జూనియర్ కాలేజీల్లో 1149 సీట్లు ఉంటే 49308 మంది పరీక్ష రాశారు. గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఎం.రవీంద్ర వరప్రసాద్(బీఏ), టి.గణే్ష(బీకామ్), బి.సాయి కృపారెడ్డి(బీఎస్సీ-ఎంపీసీ), బి.రాజశేఖర్(బీఎస్సీ- ఎంఎ్ససీఎస్) టాపర్లుగా ఉన్నారు. డిగ్రీలో 152 సీట్లు ఉంటే 963 మంది ప్రవేశ పరీక్ష రాశారు. ఎంపికైన విద్యార్థులకు బుధవారం సాయంత్రంలోగా ఎస్ఎంఎస్ ద్వారా సమచారం పంపుతామని అధికారులు తెలిపారు. విద్యార్థులు గురుకుల విద్యాలయాల సంస్థ వెబ్సైట్ నుంచి కూడా ఫలితాలు చూసుకోవచ్చని సూచించారు. గురువారం నుంచి ర్యాంకు, రిజర్వేషన్, పాఠశాలల ప్రాధాన్యత క్రమంలో పాఠశాలల్లో సీట్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జూనియర్ కాలేజీల్లో 1:5 నిష్పత్తి ప్రకారం ఈ నెల 20 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తామని తెలిపారు. డిగ్రీ కాలేజీలో 1:10 నిష్పత్తి ప్రకారం 23న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. సంస్థ నిర్వహిస్తున్న 12 మైనారిటీ పాఠశాలలు, 3 మైనారిటీ కాలేజీల్లో నేరుగా అడ్మిషన్లు కల్పిస్తామని తెలిపారు.