గులకరాయి ఘటన అభూతకల్పన: రఘురామ
ABN , Publish Date - Apr 25 , 2024 | 04:12 AM
ఈ ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు సీఎం కావాలని తిరుమల వేంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్టు నరసాపురం ఎంపీ, ఉండి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి రఘురామరాజు తెలిపారు.
తిరుమల, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ఈ ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు సీఎం కావాలని తిరుమల వేంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్టు నరసాపురం ఎంపీ, ఉండి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి రఘురామరాజు తెలిపారు. బుధవారం ఉదయం అర్చన సేవలో ఆయన పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందు రఘురామ మీడియాతో మాట్లాడుతూ... ‘టీడీపీ నుంచి ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన అనంతరం స్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చా. రాష్ట్ర ప్రజలు కష్టాల నుంచి బయటపడాలని స్వామిని కోరుకున్నా. ఇక సీఎం జగన్మోహన్రెడ్డిపై గులకరాయి దాడి నిజంగా జరిగివుంటే మంచి పరిణామం కాదు. అయితే అదో అభూత కల్పన మాత్రమే. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.