GBC జీబీసీకి గండి
ABN , Publish Date - Sep 10 , 2024 | 12:15 AM
గుంతకల్లు బ్రాంచ(జీబీసీ) ప్రధాన కాలువకు నాలుగో కిలోమీటర్ ఉండబండ పెద్ద వంక వద్ద భారీ గండి పడింది. దీంతో అధికారులు కాలువకు నీటిని ఆపివేశారు. మండలంలో మిరప రైతులకు ఆయువు పట్టుగా ఉన్న జీబీసీకి ప్రతీ ఏటా ఏదో ఒక రూపంలో సాగు నీరు బంద్ అవుతూనే ఉంది.
సాగు నీటిని బంద్ చేసిన అధికారులు
త్వరగా మరమ్మతు చేయాలంటున్న రైతులు
విడపనకల్లు, సెప్టెంబరు 9: గుంతకల్లు బ్రాంచ(జీబీసీ) ప్రధాన కాలువకు నాలుగో కిలోమీటర్ ఉండబండ పెద్ద వంక వద్ద భారీ గండి పడింది. దీంతో అధికారులు కాలువకు నీటిని ఆపివేశారు. మండలంలో మిరప రైతులకు ఆయువు పట్టుగా ఉన్న జీబీసీకి ప్రతీ ఏటా ఏదో ఒక రూపంలో సాగు నీరు బంద్ అవుతూనే ఉంది. జూలై నెల 6న జీబీసీ గట్లు, అక్విడెక్టు బలహీనతలను వివరిస్తూ ‘ఆంధ్రజ్యోతి’లో ఇప్పుడైనా అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసందే. కాలువ గట్ల బలహీనతపై సాగు నీరు రాక ముందే అధికారులను అప్రమత్తం చేసే ప్రయత్నం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. జూలై నెలలో సాగు నీరు రాక ముందే కాలువకు మరమ్మతులు చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్సడి ఉండేది కాదని నియోజకవర్గ రైతులు వాపోతున్నారు. సోమవారం ఉదయం నాలుగో కిలో మీటర్ వద్ద కాలువకు పెద్ద గండి పడటంతో వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే ఉన్న అండర్ టన్నెల్కు కొంత మంది నాన ఆయకట్టు రైతులు కుడి ఎడమల ఇరువైపులా గండ్లు కొట్టి సాగు నీటిని పెద్ద వంకకు వృథాగా తరలించుకుని వెళ్తున్నారు. గండిని జీబీసీ అధికారులు మధ్యాహ్నం పరిశీలించి వెళ్లారు. సాగు నీరు వృథా కాకుండా నీటిని మాత్రం బంద్ చేశారు. కానీ పనులను మాత్రం గాలికి వదిలేశారు. యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సి పనులను చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వెంటనే గండిని పూడ్చి తమను ఆదుకోవాలని వివిథ రకాల పంటలు సాగు చేసిన రైతులు కోరుతున్నారు.