ఐఐపీఈ క్యాంప్సకు శంకుస్థాపన
ABN , Publish Date - Mar 03 , 2024 | 03:07 AM
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పాట్నా నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.
పట్నా నుంచి వర్చువల్గా నిర్వహించిన మోదీ
రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి), సబ్బవరం, మార్చి 2: అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పాట్నా నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఐఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.విజయ్కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మురళీకృష్ణ, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 201.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో క్యాంపస్ నిర్మాణం చేపడుతున్నట్టు డైరెక్టర్ ప్రొఫెసర్ శాలివాహన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ బాధ్యతను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ (సీపీడబ్ల్యూడీ)కు అప్పగించినట్టు పేర్కొన్నారు. ఐఐపీఈలో అత్యాధునిక పరిశోధన ప్రయోగాలు కొనసాగుతాయన్నారు. వీటిల్లో సెంటర్ ఫర్ నెట్ జీరో, సెంటర్ ఫర్ హైడ్రోజన్, టెక్నాలజీ సెంటర్ ఫర్ హైడ్రోజన్ టెస్టింగ్ వాలిడేషన్, ఇంకా అకడమిక్, హాస్టల్ భవనాలు ఉంటాయన్నారు.
నాగాయలంక ఫీల్డ్ ఫేజ్-2 జాతికి అంకితం
ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్లో భాగంగా ఉన్న కేజీ బేసిన్లోని నాగాయలంక ఫీల్డ్ ఫేజ్-2ను మోదీ బిహార్లోని బెగుసరాయి నుంచి వర్చువల్గా జాతికి అంకితం చేశారు. ఈ విషయాన్ని ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ ఈడీ శాంతన్దా్స వెల్లడించారు. నాగాయలంకలో వేడుకలు నిర్వహించినట్టు తెలిపారు.