టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని
ABN , Publish Date - Apr 18 , 2024 | 03:48 AM
గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని, ఆయన తనయుడు మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్లు బుధవారం లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. గుంటూరు నుంచి
![టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని](https://media.andhrajyothy.com/media/2024/20240413/9_SUBHANI_3c4340687b.jpg)
గుంటూరు, ఏప్రిల్ 17: గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని, ఆయన తనయుడు మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్లు బుధవారం లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. గుంటూరు నుంచి అనుచరవర్గంతో ర్యాలీగా ఉండవల్లిలోని టీడీపీ కార్యాలయానికి చేరుకుని, పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సుభాని చేరికతో నియోజకవర్గంలో సమీకరణలు మారనున్నాయి. 2004లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన షేక్ సుభానికి నియోజకవర్గంలో మంచిపట్టుంది. గత ఎన్నికల్లో తమ గెలుపునకు కృషి చేసిన సుభాని టీడీపీలోకి వెళ్లటం వైసీపీ నాయకుల్లో గుబులు రేకెత్తిస్తోంది. సొంత ముస్లిం సామాజికవర్గంతోపాటు నియోజకవర్గంలో కాపు, యాదవ, ఎస్సీ సామాజికవర్గంలో కూడా తనదైన వర్గాన్ని కలిగిన నేతగా గుర్తింపు పొందారు. వివాద రహితుడిగా మంచి పేరుంది. ప్రస్తుతం ఆయన గుంటూరులోని ఆంధ్ర ముస్లిం కళాశాల కరస్పాండెంట్గా కూడా వ్యవహరిస్తున్నారు. నంబూరు సుభాని ఆధ్వర్యంలో అధికార వైసీపీ కార్పొరేటర్లు ఖాజామొహిద్దీన్ చిష్టీబాషా, మీరావలి, వేముల జ్యోతి కూడా టీడీపీలో చేరారు.